Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్నుమా దాస్'. కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇన్స్టాగ్రామ్లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో వాటిపై సోమవారం విశ్వక్ సేన్ వివరణ ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'విజయవాడలో నేను చేసిన కామెంట్స్, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. మా సినిమా పోస్టర్స్, ఫ్లెక్సీలు చించేశారు. దీంతో కోపంలో నోరు జారాను. ఆ విషయంలో క్షమాపణలు చెబుతున్నా. నేను ఏ రివ్యూ రైటర్ని, ఏ మీడియా వ్యక్తుల్ని, ఏ హీరోని తిట్టలేదు. తిట్టాల్సిన అవసరం లేదు. అయితే కావాలని నా సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. హైదరాబాద్కి వచ్చాక వారి సంగతి చెబుతానని కోపంతో అన్నాను. అంతేకానీ ఏ మీడియా వర్గాల్ని, సినిమా వాళ్ళని కాదు. నేను ఇండిస్టీలో ఉండాల్సిన వాడిని. నాకంటూ ఓ గోల్ ఉంటుంది. నా మైల్ స్టోన్ వేరే ఉంది. నేను డబ్బు ఎక్కువై సినిమా తీయలేదు. నన్ను నేను నిలబెట్టుకోవాలని, నాతోపాటు పందిమంది ప్రతిభావంతుల్ని ఇండిస్టీకి పరిచయం చేయాలని తీశా. నేను ఎవరికీ సవాల్ విసరడం లేదు. పర్టిక్యులర్ వ్యక్తుల్ని తిట్టలేదు కాబట్టి నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాపైనే నెగటివ్గా రాశారు. ఇక సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. వాళ్ళే నా సినిమాని తీసుకెళ్తున్నారు. మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. దాదాపు నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది. మంచి సినిమా తీస్తే ఆడియెన్సే బతికిస్తారని నిరూపించారు. ఈ చిత్రాన్ని ఓ సవాల్గా తీసుకుని చేశా. క్లైమాక్స్ కొత్తగా, ప్రయోగాత్మకంగా ప్రయత్నించాం. 13 నిమిషాలపాటు సింగిల్ టేక్లో షూట్ చేశాం. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. అక్కడి ఎమోషన్ ఏంటో నాకు తెలుసు. అవే ఇందులో చూపించా. కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంది. ఈ వీకెండర్లో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది' అని అన్నారు. 'సినిమాని పైరసీ విపరీతంగా చేస్తున్నారు. ఛాంబర్ సహకారంతో వాటిని అడ్డుకుంటున్నాం. కానీ సినిమాకి ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. సుకుమార్ ఫోన్ చేసి ప్రశంసించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని నిర్మాత కరాటే రాజు తెలిపారు.