Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. సురేష్బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యుంపు థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, 'సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 55 ఏళ్ళు అయ్యింది. మొదటిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేశాం. కొరియన్ సినిమాకిది రీమేక్. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేశాం. ఫ్యామిలీ విలువలు ఉన్న ఈ సినిమాని జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని అన్నారు. 'ఒకరోజు సమంత కాల్ చేసి ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ చూడమన్నారు. చూశాక రచయిత లక్ష్మి భూపాల్కి చెప్పాను. ఇద్దరం ఈ సినిమా మీద నమ్మకంతో ముందుకు వెళ్లాం. సమంత ఈ సినిమాలో కనిపించినన్ని వేరియేషన్స్ ఏ సినిమాలో కనిపించలేదు. ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను' అని దర్శకురాలు నందినిరెడ్డి చెప్పారు. సమంత మాట్లాడుతూ, 'ముందుగా డా .రామానాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది తమిళంలో 'సూపర్ డీలక్స్' సినిమాతో వచ్చాను, అలాగే తెలుగులో 'మజిలీ' సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు 'ఓ బేబి' రాబోతుంది. వరుస సక్సెస్ సినిమాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. చేస్తే మంచి సినిమాలు చేయాలనుకుంటున్న టైమ్లో ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ చూసి మిస్ చేసుకోకూడదనుకున్నా. నా మనసుకు దగ్గరైన చిత్రమిది. సినిమా చూశాక ప్రతి ఒక్కరు వారి తల్లికి హగ్ ఇస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. గోదావరి యాసలో మెప్పించబోతున్నా. నందిని రెడ్డి టేకింగ్, మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ కాబోతున్నాయి. సినిమా చేస్తున్నప్పుడు సురేష్ బాబు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా అందరికి నచ్చితే నాకు అంతకంటే సంతోషం ఏమీ ఉండదు' అని చెప్పారు.