Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతూ 'రాజ్ధూత్' చిత్రంలో నటిస్తున్నారు. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్, కార్తీక్ సంయుక్త దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని అతిథిగా విచ్చేసిన జీవిత శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'శ్రీహరి, శాంతి పిల్లలు చిన్ననాటి నుంచి తెలుసు. తల్లిదండ్రుల్లాగే మంచి వ్యక్తిత్వం గలవారు. నా ఇద్దరు అమ్మాయిలతో పాటే బిడ్డల్లాంటి వారు. మేఘామ్ష్ హీరోగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. సినిమా టీజర్, రషెస్ చూశా. మేఘామ్ష్లో మంచి ఈజ్ కనిపిస్తుంది. శ్రీహరి కన్నా పదిరెట్లు మంచి పేరు సంపాదిస్తాడన్న నమ్మకం ఉంది. శ్రీహరి మన మధ్య లేని లోటుని మేఘామ్ష్ తీర్చేశాడు. తను పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. దర్శకుల పనితనం ప్రశంసనీయం. చిన్న సినిమాలనే గొప్పగా చెప్పుకునేలా తీయాలి. అలా ఈ సినిమా గొప్ప సినిమాల కోవలో నిలుస్తుంది. నిర్మాత సత్యానారాయణనే నా కూతురు '2 స్టేట్స్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల దానికి బ్రేక్ పడింది. మేఘామ్ష్, శివాత్మికలకు తగ్గ మంచి కథ కూడా సిద్ధమైంది' అని అన్నారు.
'జీవిత నాకు బాల్య స్నేహితురాలు. మా అబ్బాయి సినిమా టీజర్ ఆమె చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఒకసారి మాత్రమే లోకేషన్కు వెళ్ళి మేఘామ్ష్ని గమనించా. చాలా బాగా నటించాడనిపించింది. తెలుగు ప్రేక్షకులు బావ(శ్రీహరి)ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నట్లే నా బిడ్డని కూడా చూసుకుంటారని ఆశిస్తున్నాను' అని శాంతి శ్రీహరి తెలిపారు. హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ, 'హీరోగా నాకిది తొలి చిత్రం. అమ్మానాన్నల వల్లే నేనీరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. 'రాజ్ ధూత్' మంచి కథ ఉన్న చిత్రం. సుదర్శన్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. దర్శకులిద్దరూ చాలా క్లారిటీతో తెరెక్కించారు. టెక్నికల్గాను హైలైట్గా ఉంటుంది. మాటలు, పాటలు, సంగీతం అన్ని బాగా కుదిరాయి. వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రేక్షకులంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'రచయితలుగా పలు సినిమాలకు పనిచేశాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శాంతిగారికి, నిర్మాత సత్యనారాయణకి కృతజ్ఞతలు. పోస్టర్, టీజర్ చూస్తేనే సినిమా స్టోరీ ఏంటన్నది అర్ధమవుతుంది. హీరో రాయల్ ఎన్ ఫీల్డ్ మీదున్నాడు. ఆ పక్కనే 'రాజ్ ధూత్' ఉంది. అదే ఈ సినిమా కథ' అని చిత్ర దర్శకులు తెలిపారు. చిత్ర నిర్మాత ఎమ్.ఎల్.వి సత్యనారాయణ మాట్లాడుతూ, 'శ్రీహరి అబ్బాయిని హీరోగా పరిచయం చేసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. నామీద నమ్మకంతో శాంతి ఈ బాధ్యతల్ని అప్పగించారు. ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. కథని నమ్మి చేసిన చిత్రమిది. దర్శకులిద్దరూ బాగా తెరకెక్కించారు. సినిమా సక్సెస్పై ధీమాగా ఉన్నాం. మేఘామ్ష్తో రెండవ సినిమా కూడా నా బ్యానర్లోనే ఉంటుంది' అని అన్నారు.