Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. రచయితగా అత్యంత ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుని దక్కించుకున్నారు. అంతేకాదు నటుడిగా ఆయన చిత్ర పరిశ్రమకి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లోని అనేక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అందరినీ అలరించారు.
గిరీష్ కర్నాడ్ 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరన్ ప్రాంతంలో జన్మించారు. తండ్రి రఘునాథ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి. తండ్రి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. చిన్నతనంలో ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసిలో డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అంతేకాదు తన ప్రతిభతో ఆక్స్ఫర్డ్ డిబేట్ క్లబ్కు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆసియా ఖండానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.
కర్నాడ్ నటించిన కన్నడ చిత్రం 'సంస్కార'ని వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా తీసి మెప్పుపొందారు. ఇందులో కర్నాడ్ ప్రాణేశాచార్య అనే ప్రధాన పాత్ర పోషించారు. మరో ప్రముఖ నటుడు పి.లంకేష్ ఇందులో నెగటివ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి పట్టాభిరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి స్వర్ణకమలం పొందిన కన్నడ చిత్రం కావడం విశేషం. తర్వాత బి.వి.కారంత్ అనే ప్రసిద్ధ దర్శకునితో కలిసి సహదర్శకత్వంలో ఎస్.ఎల్.బైరప్ప రాసిన వంశవృక్ష కావ్యం ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని రూపొందించారు. దీనికి పలు రాష్ట్రీయ, అంతరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కర్నాడ్ 'ప్రేమికుడు' సినిమాలో విలన్గా తన విలక్షణ నటనని ప్రదర్శించారు. తెలుగులో 'ఆనంద బైరవి', 'రక్షకుడు', 'కొమరం పులి', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'ధర్మ చక్రమ్', 'స్కెచ్ ఫర్ లవ్' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. దీంతోపాటు 'టైగర్ జిందా హై', 'చక్ ఎన్ డస్టర్', 'శివారు', 'ఏక్ థా టైగర్', 'డోర్', 'ఇక్బాల్', 'చైనా గేట్' వంటి చిత్రాలతో హిందీ ఆడియెన్స్ని, '24', 'ముగమూడి', 'నర్తాంగి', 'హే రామ్', 'కాధలన్' వంటి సినిమాలతో తమిళ ఆడియెన్స్ని ఆకట్టుకున్నారు. ఇక ఆయన సొంత ఇండిస్టీగా భావించే కన్నడలో అనేక విజయవంతమైన సినిమాలతో అగ్ర నటుడిగా మెప్పుపొందారు. నటుడిగానే కాదు దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్నారు. 'వంశ వృక్ష', 'తబ్బిలియు నీనడె మగనె', 'ఒండనోండు కలడల్లి', 'కనూరు హెగ్గదితి', 'కాడు' వంటి కన్నడ చిత్రాలకు, 'గోదులి', 'ఉత్సవ్' వంటి హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. పలు డాక్యుమెంటరీలను కూడా రూపొందించారు. అగ్ని శ్రీధర్ రచయితతో కలిసి 'ఆ దినగళు' అనే చిత్రానికి కథ అందించారు. 1972లో 'వంశ వృక్ష' కన్నడ సినిమాకి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఆయన నటించిన దాదాపు పది సినిమాలు జాతీయ అవార్డులను అందుకోవడం విశేషం. గిరీష్ కర్నాడ్ మృతి పట్ల హిందీ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు.