Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చంటబ్బాయి' సినిమాని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. కానీ కథా పరంగా రెండింటికీి సంబంధం లేదు' అని అంటున్నారు దర్శకుడు స్వరూప్.
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ, 'మాది నెల్లూరు. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. బెంగుళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశా. అట్నుంచి యుఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది. సినిమా తీయాలనే ప్యాషన్ చాలా రోజులుగా ఉంది. సినిమాలపై అవగాహన కోసం పలు లఘు చిత్రాలు తీశా. డిటెక్టివ్ నేపథ్యంలో మన దగ్గర సినిమాలొచ్చి చాలా రోజులవుతుంది. 'చంటబ్బాయి' తర్వాత మరే సినిమా రాలేదు. ఇది చాలా ఆసక్తికరమైన జోనర్. దీనిపై కథ రాసుకున్నా. కొత్త హీరోతో చేయాలనుకుని హీరో నవీన్ని అప్రోచ్ అయ్యాను. ఆయన హిందీలో పలు వీడియోలు చేస్తుండేవారు. సినిమాల్లో కూడా నటించారు. తన కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. ఈ కథ ఆయనకు నచ్చడంతో దాదాపు ఆరు నెలలు ట్రావెల్ అయ్యాం. ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. స్వతహాగా ఆయన కూడా మంచి రైటర్. దీనిపై చర్చించి కథని ఫైనల్ చేశాం. పట్టణాల్లో సాగే డిటెక్టివ్ చిత్రమిది. థ్రిల్లర్ ప్రధానంగా సాగుతుంది. లోకల్ డిటెక్టివ్ చిన్నా, చితకా కేసులు డీల్ చేస్తుంటాడు. సరైన కేసు కోసం ఎదురు చూస్తున్న టైమ్లో అలాంటి ఓ కేసు వస్తే ఎలా డీల్ చేశాడు? ఆ కేసు వెనకాల ఉన్న కథ ఏంటనేది సినిమా. మొదట ఈ సినిమాకి 'గూఢచారి' అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ అప్పటికే ఆ పేరుతో మరో సినిమా వచ్చింది. దీంతో ఏజెంట్ పక్కన బాగా వినిపించే తెలుగు పేరు ఉంటే బాగుంటుందని 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' పెట్టాం. ఈ టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ పోవడానికి ఓ కామెడీ వీడియో కూడా చేశాం. దానికి మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్కి విశేష స్పందన లభించింది. సినీ ప్రముఖులు అప్రిషియేట్ చేశారు. టెస్ట్ రన్లాగా సినిమా కూడా ప్రదర్శించాం. అందరూ బాగుందన్నారు. చాలా నమ్మకంగా ఉన్నాం. నేను ఏ దర్శకుడి దగ్గరా పనిచేయలేదు, దీంతో షూటింగ్లో ప్రతి రోజు ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొన్నాను. అంతిమంగా సినిమాని ఎంజారు చేశాం. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా. నా ప్రధాన బలం కామెడీ, థ్రిల్లర్, డ్రామా. వాటి ప్రధానంగానే సినిమాలు చేస్తాను' అని అన్నారు.