Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గుణ 369'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ బుధవారం ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను సంయుక్తంగా ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ''తులసి' నుంచి ఇప్పటి వరకు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. అర్జున్కి ఏ బాధ్యత అప్పగించినా సరే పూర్తి చేసేంత వరకు నిద్రపోడు. ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడే అలా చేస్తే, తనే దర్శకత్వం వహిస్తే ఎలా పని చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. తన కోసం స్నేహితులు నిర్మాతలుగా మారడం అతని అదృష్టం. కెమెరా వర్క్, సంగీతం చాలా బాగున్నాయి. కార్తికేయ నటించిన 'ఆర్ ఎక్స్ 100' కొత్తగా ఉంటుంది. ఇది కూడా మరింత కొత్తగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించి పేరు, డబ్బులు రావాలి' అని అన్నారు.
'ఈ ట్రైలర్ చూస్తుంటే బోయపాటి సినిమా ట్రైలర్ చూసినట్టు ఉంది. నాకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటితో మరో సినిమా చేయాలనుకుంటున్నా. అలాగే కార్తికేయను గీతా ఆర్ట్స్లోకి ఆహ్వానిస్తున్నా. సినిమా కోసం 100% నటన ఇవ్వగల నటుడు కార్తికేయ. అనఘ సహజ నటిగా కనిపిస్తుంది. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన పెద్ద సినిమా వెనక్కి వెళ్ళడంతో ఇప్పుడు విడుదల లెక్కలు మారుతున్నాయి' అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
హీరో కార్తికేయ చెబుతూ, 'ఈ కథ విన్న ముప్పై నిమిషాల్లోనే ఓకే చేశాను. అంత బాగా నచ్చింది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫైట్స్ కూడా సహజంగా, సందర్భానుసారంగా ఉంటాయి. మన దగ్గర రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తాయనే వారికి ఈ సినిమా సమాధానం చెబుతుంది. ఇప్పటి వరకు నన్ను 'ఆర్ ఎక్స్ 100' హీరో అని పిలుస్తున్నారు. ఈ చిత్రంతో గుణ అని పిలుస్తారు. సాధారణంగా ఏ హీరో అయినా తన నటన గురించి చెప్పుకోరు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశా. నేను ఇంత బాగా చేశానా?, నాలో ఇంత ఉందా అనిపించింది. మా అతిథులు అల్లు అరవింద్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు'ని మించి ఈ చిత్రం విజయం సాధిస్తుంది(నవ్వుతూ). సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది' అని చెప్పారు.
'యదార్థ సంఘటన ఆధారంగా చేసిన చిత్రమిది. సినిమాలోని పాత్రలతో మనల్ని మనం చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నా గురువు బోయపాటి, అల్లు అరవింద్కి థ్యాంక్స్' అని దర్శకుడు అర్జున్ జంధ్యాల తెలిపారు. 'దర్శకుడు మాకు ఏదైతే చెప్పారో దాన్నే తెరపై చూపించారు. సెకండాఫ్లో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి' అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ కడియాల, కౌముది, హేమ, రామ్, చైతన్ భరద్వాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.