Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాకు ప్రారంభం నుంచి మంచి అవకాశాలొస్తున్నాయి. ఇదే నిజమైన సక్సెస్గా భావిస్తున్నా' అని అంటోంది నిధి అగర్వాల్. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవల సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, 'గతంలో తెలుగులో 'మిస్టర్ మజ్ను', 'సవ్యసాచి' చిత్రాల్లో నటించా. 'మిస్టర్ మజ్ను'లో నా నటన చూసి దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను ఎంపిక చేశారు. ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. సౌత్లో పూరీ జగన్నాథ్ ఓ పెద్ద దర్శకులు. ఆయన చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావించా. సినిమా విడుదలైన ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 'సవ్యసాచి' దర్శకుడు చందు మొండేటి ఫస్ట్ మెసేజ్ చేసి అభినందించారు. కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నావ్ అన్నారు. తర్వాత చాలా మంది అభినందించారు. ముఖ్యంగా నా నటన గురించి మాట్లాడుకుంటున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. కెరీర్లో తొలి విజయంతోపాటు ఈ సినిమా ద్వారా మాస్ ఆడియెన్స్ వపర్ ఏంటో తెలిసింది. వారి వల్లే సినిమా ఇంత బాగా ఆదరణ పొందగలుగుతుంది. సినిమాలో ఎక్కువగా గ్లామరస్గా కనిపించానని అంటున్నారు. అది వారు చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అదే సమయంలో ఇందులో నేను క్యూట్గా కనిపిస్తున్నావంటున్నారు. దర్శకుడు గ్లామర్ ఎంత వరకు చూపించాలో, ఎంత అందంగా చూపించాలో అంతే చూపించారు. ఎక్కడా హద్దులు మీరలేదు. అయితే నేను నటించిన మొదటి రెండు సినిమాలు విజయం సాధించలేదు. అయినప్పటికీ ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నేను సినిమాని ప్రేమిస్తాను. షూటింగ్ని ఆస్వాదిస్తాను. మన వృత్తిని ఇష్టపడటమే నిజమైన సక్సెస్. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కెరీర్ ప్రారంభం నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇదీ మరో సక్సెస్గా భావిస్తున్నా. ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజెక్ట్లకు చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో జయం రవి హీరోగా రూపొందే చిత్రంలో నటిస్తున్నా. తెలుగు భాషపై ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నా. బాలీవుడ్లో వచ్చిన 'రంగీలా' నాకిష్టమైన చిత్రం. అందులో ఊర్మిళ తరహా పాత్రను పోషించాలనేది నా డ్రీమ్' అని అన్నారు.