Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు సినిమా రచనలో తొలి తరానికి చెందిన సముద్రాల సీనియర్ (రాఘవాచార్య) ప్రాతఃస్మరణీయులు. ఆయన పాటలు, మాటలు ఇవాళ్టికీ జనంలో నిలిచిపోయాయి. సముద్రాల, పింగళి లాంటి పెద్దలు వేసిన బాటలోనే తర్వాతి తరాలకు చెందిన మేమూ నడుస్తున్నాం. నేటి సినీ రచయితల ఈ వైభవమంతా అప్పుడు వారు పెట్టిన భిక్ష' అని ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. శుక్రవారం సముద్రాల సీనియర్ 117వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నిర్మాత, సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ, 'మాస్టారూ' అంటూ మా తండ్రి ఎన్టీఆర్ గౌరవంగా పిలుచుకొనే సముద్రాల మా సొంత సంస్థకు 'శ్రీసీతారామ కల్యాణం' లాంటి అనేక ఆణిముత్యాలు అందించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్తో 'వినాయక చవితి', 'బభ్రువాహన' చిత్రాలను రూపొందించారు' అని సముద్రాలతో తమకున్న అనుబంధాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సాయిమాధవ్ మాట్లాడుతూ, 'కె.వి. రెడ్డి దర్శకత్వంలో సముద్రాల రచన చేసిన నాగయ్య 'యోగి వేమన' చిత్రంలో సాగిన ఆయన రచన నేటి సినీ రచయితలకు ఓ పెద్ద బాలశిక్ష. కొన్ని సందర్భాల్లో కలం ముందుకు సాగనప్పుడు నేను ఇప్పటికీ ఆ సినిమా చూస్తూ, ఆ రచన ద్వారా ప్రేరణ పొందుతుంటా' అని చెప్పారు. సముద్రాల సీనియర్ మనుమడూ, సముద్రాల జూనియర్ ఆఖరి కుమారుడూ అయిన విజయరాఘవాచారి మాట్లాడుతూ, 'మా తాత, తండ్రి సినిమా రంగంలో ఎంతో కృషి చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, త్రివిక్రమరావు, కమలాకర కామేశ్వరరావు, కె. విశ్వనాథ్ లాంటి ప్రముఖులతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది' అని చెప్పారు.