Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగులో తొలిసారి కచేరి నిర్వహిస్తున్నాం. నాతోపాటు ఏసుదాస్, చిత్ర ఈ కచేరిలో పాటలు పాడనున్నారు. కేవలం తెలుగు పాటలే పాడతాం' అని నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
కె.జె. ఏసుదాస్, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, కెయస్ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్తో ఎలెవన్ పాయింట్ టు, బుక్ మై షో సంయుక్తంగా 'లెజెండ్స్' పేరుతో సంగీత కచేరిని నవంబర్ 30న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, 'గతంలో వేరే దేశాల్లో సంగీత కచేరీ చేశాం. కానీ తెలుగులో ఇదే మొదటిసారి. సింగపూర్లో మా అబ్బాయి చరణ్, ఎలెవన్ పాయింట్ టు, బుక్ మై షో వారు దీన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ కూడా అదే విధంగా ఎంతో ప్లాన్డ్గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రొఫెషనల్స్ అయిన మ్యుజిషియన్స్ ఈ షోకి మ్యూజిక్ బ్యాండ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్ట్రింగ్స్ సెక్షన్లో ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వారు ప్లే చేయనున్నారు. రెహ్మాన్కి రైట్ హ్యాండ్ అయిన శ్రీనివాస మూర్తి కండక్టర్గా వ్యవహరించనున్నారు. అన్నయ్య ఏసుదాస్ పాటతో ప్రారంభమయ్యే ఈ సంగీత కచేరిలో అందరికీ ఇష్టమైన తెలుగు పాటలు పాడనున్నాం. ఇది ఎంతో ఖర్చుతో కూడినది. వ్యాపార ధోరణిలో చేస్తున్న ఓ అందమైన సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పొచ్చు' అని అన్నారు. 'ఏసుదాస్, నాన్న(బాలు), చిత్ర ముగ్గురు ఒక వేదికపై పాటలు ఆలపించడం నాతోపాటు అందరికీ వీనుల విందుగానే ఉంటుంది. ఈ లైవ్ కాన్సర్ట్ రెగ్యులర్గా చేయాలని ఉన్నప్పటికీ ముగ్గురు చాలా బిజీగా ఉండటంతో వారి టైమ్, డేట్స్ తీసుకుని చేయడం వల్ల చాలా గ్యాప్ వస్తోంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన 'లెజెండ్స్- ఏ లైవ్ కాన్సర్ట్' అంతటా మంచి సక్సెస్ అయ్యింది. ఈ ముగ్గురు లెజెండ్స్ ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో వేల పాటలు పాడారు. అందులో కొన్ని పాటలు సెలెక్ట్ చేయడం కష్టమే. అయినా కూడా శ్రోతలకు బెస్ట్ సాంగ్స్ అందించే ప్రయత్నం చేస్తాం' అని ఎస్పీ చరణ్ చెప్పారు.