Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్రప్రసాద్, విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి ప్రధాన పాత్రధారులుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో ఐశ్వర్య మాగంటి సమర్పణలో సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న చిత్రం 'తోలుబొమ్మలాట'. ఈ చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ''లేడీస్ టైలర్'కి ముందు సూసైడ్ చేసుకోవాలనుకున్నా. కానీ ఆ సినిమా నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత 'ఓ బేబీ' వరకు అనేక సినిమాలు చేసి ఈ స్థాయికి వచ్చా. నటుడిగా ఇప్పుడు రిలాక్స్ కావచ్చు. కానీ ఈ కథ విన్నప్పుడు భయమేసింది. ఒళ్లు దగ్గరపెట్టుకుని చేయమని హెచ్చరించింది. అంతేకాదు ఈ చిత్ర దర్శకుడిపై నా అభిప్రాయాన్ని కూడా మార్చింది. మంచి కుటుంబ కథా చిత్రమిది. నాకు, నారాయణరావు పాత్రల మధ్య స్నేహం ఫ్రెండ్షిప్ విలువని తెలుపుతుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరినీ నేను ఫ్యామిలీలా ట్రీట్ చేశా. అందుకే వాళ్ళు అంతే బాగా పాత్రల్లో లీనమై చేశారు. ఇంత బాగా వచ్చిందంటే కారణం కథ. సినిమాలో అన్ని నవరసాలుంటాయి. ఆనాటి గుర్తులను నేటి తరానికి చెప్పే చిత్రమవుతుంది. ఫ్యామిలీ అనుబంధాలు తెలిపే ఈ చిత్రం ప్రతి కుటుంబం తమ ఇంట్లో దాచుకునేలా ఉంటుంది' అని అన్నారు.
'ఇది అద్భుతమైన కథ. రాజేంద్రప్రసాద్తో ఉన్న నలభై ఏండ్ల స్నేహం ఇందులో ప్రతిబింబిస్తుంది. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. మంచి సందేశం ఇచ్చే చిత్రమవుతుంది' అని నారాయణరావు తెలిపారు. చిత్ర దర్శకుడు విశ్వనాథ్ చెబుతూ, 'మన ఇంట్లో ఉండే నవ్వులు, భావోద్వేగాలు, సెంటిమెంట్స్, అల్లరి, దు:ఖం, ప్రేమ ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. రాజేంద్రప్రసాద్ సపోర్ట్తో సినిమా బాగా వచ్చింది. నవంబర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. 'కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ వంటి విలక్షణ నటుడితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు విశ్వనాథ్, నా కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. ఇప్పుడు ఒకే సినిమాతో కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇది మా అందరికి గౌరవం తెచ్చే చిత్రమవుతుంది' అని హీరో విశ్వంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవిప్రసాద్, హర్షిత చౌదరి, కల్పన, నర్రా శ్రీనివాస్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్, ఆర్ట్ మోహన్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.