Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరో వెంకటేష్ అంటే ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని హీరోగా మారాను' అని అంటున్నారు అనురాగ్ కొణిదెన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ మళ్ళీ చూశా'. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ కథానాయికలుగా, హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో అనురాగ్ కొణిదెన మీడియాతో మాట్లాడుతూ, 'చిన్నప్పట్నుంచి యాక్టింగ్పై ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులు మా నాన్న నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ పనులు చూసుకున్నాను. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి మరింత పెరిగింది. పైగా హీరో అనేది ఈ ఏజ్లోనే కావాలి. అదే విషయం మా నాన్న(కోటేశ్వరరావు)కి చెప్పాను. ఆయన మరో మాట లేకుండా 'గో హెడ్' అన్నారు. నా కోసం నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు హేమంత్ రైటర్గా పరిచయం. ఆయన మంచి కథ చెప్పారు. చాలా కొత్త కాన్సెప్ట్. బాగా నచ్చి ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని రకాల వాణిజ్య అంశాలు మేళవించిన ప్రేమ కథా చిత్రమిది. ఇందులో నా పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. ఓ వైపు కాలేజ్ కుర్రాడిగా, మరోవైపు మాస్ క్యారెక్టర్లో కనిపిస్తాను. అలా రెండు షేడ్స్లో ఎందుకు కనిపించాల్సి వచ్చింది, అలా ఎందుకు మారాననేది తెరపై చూడాలి. అల్లరి చిల్లరగా తిరిగే నాకు ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీని చదువుతుంటే నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దీంతో ఇంత మంచి డైరీ రాసిన అమ్మాయిని కలవడం కోసం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తాను. ఇక్కడ నాకు మరో అమ్మాయి పరిచయం అవుతుంది. మరి వాళ్ళతో నా ప్రేమ జర్నీ ఎలా ప్రారంభమైంది, డైరీ రాసిన అమ్మాయిని కలుసుకున్నానా? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరం. సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది. దర్శకుడు అద్భుతంగా రూపొందించారు. కథానాయికలు శ్వేత, కైరవి తమదైన నటనతో, అందంతో ఆకట్టుకుంటారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళంతా సినిమా బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, ఏ.కె.ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాత అనిల్ సుంకర సినిమా చూసి అభినందించారు. డాడీతోపాటు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఇండిస్టీ అంటే ఏముందిలే ఈజీ అనుకున్నా. వచ్చాక చాలా కష్టమని అర్థమైంది. ఈ సినిమాకి హీరోని, నిర్మాతని నేనే కావడంతో రెండూ చూసుకోవడం చాలా కష్టమైంది. మొదటి చిత్రానికే ఈ రెండు బాధ్యతలు నిర్వహించి చాలా నేర్చుకున్నాను. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ ఎంతో హెల్ప్ చేశారు. తనే అన్ని చూసుకున్నారు. నాకు బ్యాక్ బోన్లా ఉన్నారు. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో తెలియదు, కానీ నటుడిగా నాకు గుర్తింపు తెస్తుంది. నేను నవరసాలు పండించగలనని అందరికి తెలిసేలా చేస్తుంది. మున్ముందు నాకిది ఓ విజిటింగ్ కార్డ్లా ఉపయోగపడుతుంది. దాదాపు 150 థియేటర్లలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. నెక్ట్స్ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. దాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తాం' అని చెప్పారు.