Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం నా తమ్ముళ్ళు అశ్విన్, కళ్యాణ్. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నాకు రెండు భుజాలుగా ఉన్నారు. అశ్విన్ని హీరోగా నిలబెట్టడం, కళ్యాణ్ని నిర్మాతని చేయడం నా లక్ష్యం. ఈ సినిమాతో ఆ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నా' అని ఓంకార్ అన్నారు.
అశ్విన్బాబు, అవికా గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రం 'రాజుగారి గది 3'. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కెమెరామెన్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ, 'ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం. భయపెడుతూనే నవ్విస్తుంది. ఓంకార్ చాలా కష్టపడి తెరకెక్కించారు. మా అందరి దగ్గర్నుంచి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. అశ్విన్ నటన నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. అవికా గోర్ ముందుగా నచ్చలేదు. కానీ సినిమా పూర్తయ్యాక ఆమె ప్రేమలో పడేలా చేసింది. అత్యద్భుతంగా నటించింది. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ కాబోతుంది' అని అన్నారు.
'సినిమా ఇంత త్వరగా పూర్తయి విడుదలకు వస్తుందంటే ఛోటా కె.నాయుడు సపోర్ట్, ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్ల సహకారం. ఛోటా అన్న తన రెమ్యూనరేషన్ ఎంతో కూడా అడక్కుండానే ఈ సినిమాని పూర్తి చేసి ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. అవికా ఈ సినిమాతో బిజీ హీరోయిన్ అయిపోతుంది. నా తమ్ముళ్ళు అశ్విన్, కళ్యాణ్ నేను యాంకర్గా ఉన్నప్పట్నుంచి నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అశ్విన్ని హీరోగా నిలబెట్టడం నా బాధ్యత. ఈ చిత్రంతో ఆది తీరుతుందనుకుంటున్నా. అందుకే ఇన్ని రోజులు వైట్ షర్ట్ వేసుకుంటున్నా. అశ్విన్కి హీరోగా గుర్తింపు వచ్చిందంటే రెగ్యులర్ డ్రెస్ వేసుకుంటాను. ఇక కళ్యాణ్ని నిర్మాతగా నిలబెట్టాలి. ఇటీవల మా నాన్నగారు చనిపోయారు. కానీ ఈ సినిమా వల్ల ఛోటా లాంటి అన్నయ్య దొరికారు. మేం ఎంతో కష్టపడి వచ్చాం. మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కచ్చితంగా చిన్న పిల్లలు, పెద్దలు, యూత్, మహిళలు ఇలా అన్ని వర్గాలను ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది' అని దర్శకుడు ఓంకార్ తెలిపారు.
హీరో అశ్విన్ చెబుతూ, 'ఈ సినిమాతో హీరోగా నా కల నెరవేరబోతుంది. ఇదొక మంచి అనుభవం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా సొంత సినిమాలా భావించి చేశారు. వారందరికి థ్యాంక్స్' అని అన్నారు. 'ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది సొంత సినిమాలా అనిపిస్తుంది. అందుకే చాలా నర్వస్గా ఉంది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది' అని హీరోయిన్ అవికా గోర్ తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ శ్రీను చెబుతూ, ''హుషారు', 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాలను విడుదల చేసి హిట్ అందుకున్నాను. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాం' అని చెప్పారు.