Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మర్ సందడి ముగిసింది. దసరా సీజనూ పూర్తయ్యింది. ఇక త్వరలో రాబోతున్న అతిపెద్ద సీజన్ సంక్రాంతి. ఎప్పటిలాగే పలు భారీ చిత్రాలు సంక్రాంతి బరికి సై.. అంటున్నాయి. సంక్రాంతి హాలీడేస్ని క్యాష్ చేసుకోవాలని దర్శక, నిర్మాతలు ఇప్పటికే తమ సినిమాల రిలీజ్ డేట్లని ప్రకటించేశారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ అగ్ర హీరోల సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి కోడి పందెలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వెండితెరపై సినీ పోరు సాగనుంది. ఈసారి నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి పోటీలో దిగుతున్నాయి. అలాగే బాలీవుడ్లోనూ భిన్న నేపథ్యంలో రూపొందిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అగ్ర కథానాయకుల సినిమాలతోపాటు భిన్న జోనర్ చిత్రాల రిలీజ్తో రాబోయే సంక్రాంతి రేస్ రసవత్తరంగా ఉండబోతుందని వేరే చెప్పక్కర్లేదు.
వెంకీమామ
మహేష్బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', వెంకటేష్, నాగచైతన్యల 'వెంకీమామ', కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. అందులో ముందుగా వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్ 'వెంకీమామ' సంక్రాంతి సందడిని ప్రారంభించబోతోంది. ఇది జనవరి 11న రిలీజ్ కానుంది. మామా అల్లుడు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్పుత్, చైతూ సరసన రాశీఖన్నా నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రంలో వెంకీ రైతుగా, చైతూ సైనికుడిగా కనిపించనున్నారట. దసరా కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్కి విశేషమైన స్పందన వచ్చింది. సంక్రాంతికి మంచి వినోదాన్ని పంచే చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. 'ఎఫ్2'తో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన వెంకీ మరోసారి మల్టీస్టారర్తో రాబోతుండటంతో దీనిపై అందరిలో ఆసక్తితోపాటు భారీ అంచనాలూ ఉన్నాయి.
సరిలేరు నీకెవ్వరు
జనవరి 12న రెండు భారీ చిత్రాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటీపడుతున్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో పక్కా ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో సోల్జర్గా మహేష్ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని దిల్రాజ్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్, ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. విజయశాంతి రీఎంట్రీ ఇస్తూ కీలక పాత్రలో నటిస్తుండటం ఈ చిత్రానికి ఓ ప్రధాన ఆకర్షణ. 'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి వరుస విజయాలతో మహేష్ మంచి ఫామ్లో ఉండటం, 'ఎఫ్2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా చేయడంతో సర్వత్రా క్రేజ్ నెలకొంది.
అల వైకుంఠపురంలో..
గతేడాది 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో పరాజయం ఎదుర్కొన్న అల్లు అర్జున్ చాలా గ్యాప్తో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' నటిస్తున్నారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే రెండోసారి నటించడం విశేషం. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది కూడా పక్కా మాస్ ఎలిమెంట్స్తో ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గీతాఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఎంత మంచివాడవురా
మూడు రోజుల గ్యాప్తో జనవరి 15న కళ్యాణ్ రామ్ బరిలో దిగబోతున్నారు. సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు ఆయన నటిస్తున్న 'ఎంత మంచివాడవురా' చిత్రం విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వినోదం, యాక్షన్ మేళవింపుగా ఉంటుందట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ నటిస్తుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. '118' విజయం తర్వాత కళ్యాణ్రామ్ నటిస్తున్న ఈ చిత్రంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కళ్యాణ్రామ్ సైతం ఈ సినిమా విజయంపై మరింత నమ్మకంగా ఉన్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
బరిలో బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు
తమిళంలోనూ భారీ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అందులో సూర్య నటిస్తున్న 'సూరారై పోట్రు' జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతుంది. సామాన్యులు కూడా విమానం ఎక్కేలా టికెట్ ధరలను తగ్గించి సంచలనం సృష్టించారాయన. ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే ఈ సినిమాలో సూర్యకి జోడీగా అపర్న బాలమురళీ, కీలక పాత్రల్లో మోహన్బాబు, జాకీ షరాఫ్ నటిస్తున్నారు.. దీన్ని సిఖ్యా ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో కలిసి సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య నిర్మించడం విశేషం. 'ఎన్జీకే', 'బందోబస్త్' పరాజయాల తర్వాత నటిస్తున్న ఈ చిత్రంపై సూర్య ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సూర్య సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. మరీ ఇది తెలుగులో విడుదలవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
దీంతోపాటు సంక్రాంతి బరిలో రజనీకాంత్ 'దర్బార్' కూడా ఉంది. ఫస్ట్టైమ్ రజనీకాంత్, ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. నయనతార కథానాయికగా, నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది. ముంబయి బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రజనీకాంత్ అలెక్స్ పాండియన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 14న(డేట్లో స్పష్టత లేదు) విడుదల కానుంది. అయితే ఇది తమిళంతోపాటు తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్ కాబోతుంది. దీంతో తెలుగు చిత్రాలకు గట్టి పోటీనివ్వబోతుందని వేరే చెప్పక్కర్లేదు. వీటితోపాటు కార్తీ నటిస్తున్న 'సుల్తాన్' కూడా సంక్రాంతికే విడుదల కానుందని సమాచారం.
బాలీవుడ్లోనూ సంక్రాంతికి రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో దీపికా పదుకొనె 'ఛపాక్' చిత్రం ఇప్పటికే క్రేజ్ని సంపాదించుకుంది. రణ్వీర్ సింగ్తో పెళ్ళైన తర్వాత ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిది. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా మహిళా దర్శకురాలు మేఘనా గుల్జర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపికా ఒదిగిపోయిన తీరు ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
అదే రోజు అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, కాజోల్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'తానాజీ: ది అన్సంగ్ వారియర్' చిత్రం రిలీజ్ అవుతుంది. ఇది మరాఠి ఎంపైర్ ఛత్రపతి శివాజీ ఆస్థానంలోని సైనిక అధిపతి తానాజీ మలుసరే జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ డ్రామా. ఇందులో తానాజీగా అజరు దేవగన్ నటిస్తున్నారు.