Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమని ప్రధాన పాత్రధారిణిగా, నటరాజ్, శ్రీ పల్లవి జంటగా రూపొందుతున్న చిత్రం 'అమ్మ దీవెన'. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం ఆమని పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన మాజీ డిప్యూటీ సీఎం సున్నం రాజయ్య, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి సంయుక్తంగా పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సున్నం రాజయ్య మాట్లాడుతూ, 'నా మిత్రుడు మారయ్య, గురవయ్య ఈ సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. ఎటువంటి దీవెన అయినా తక్కువవ్వొచ్చు కాని అమ్మదీవెన ఎప్పుడూ తక్కువ ఉండదు. కుటుంబంపై అమ్మ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మంచి మదర్ సెంటిమెంట్తో రూపొందే ఈ చిత్రంలో అమ్మ పాత్రలో ఆమని నటించడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఆమనిగారు 'సిసింద్రి'లో అమ్మగా అద్భుతంగా నటించారు. తల్లి దీవెనలు ఉంటే మనం ఎప్పుడూ పై చేయిలో ఉంటాం' అని బొంతు శ్రీదేవి తెలిపారు. ఆమని మాట్లాడుతూ, 'తాగుబోతు మొగుడితో నలుగురు పిల్లల్ని పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అమ్మగా ఓ తల్లి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పే చిత్రమిది. ఈ చిత్ర నిర్మాతలు తమ అమ్మ మీద ప్రేమని ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నారు. దర్శకుడు శివ ఈ కథ చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. సినిమాలో అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని సన్నివేశాలు చాలా నేచురల్గా తీశారు. 'శుభసంకల్పం'లో నేను వితౌట్ మేకప్గా డీ గ్లామర్ పాత్ర చేశా. ఆ తర్వాత అంత డీ గ్లామర్ పాత్ర ఇందులోనే నటించా. కెమెరామెన్ సినిమాని చాలా అందంగా చూపించారు. సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోగా నట్రాజ్, హీరోయిన్ పల్లవి చాలా బాగా నటించారు. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్గారికి రుణపడి ఉన్నాను. ఇది చాలా మంచి చిత్రమవుతుంది. ఈ నెలాఖరులో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని దర్శకుడు శివ చెప్పారు.