Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిరామ్ వర్మ, కృతి గార్డ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో ఏ.వి.ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రాహు'. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన పాటలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆడియో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన నటి జీవితా రాజశేఖర్ చిత్ర బృందానికి షీల్డ్లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'మధుర శ్రీధర్పై నమ్మకంతో ఈ వేడుకకి వచ్చాను. ఆడియో, టీజర్, ట్రైలర్స్ బాగున్నాయి. టైటిల్ ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. టీమ్కి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. 'సంగీతం హిట్ అయితే సినిమా సగం విజయం సాధించినట్టే. ఓపెనింగ్స్ బాగా వస్తాయి. చిన్న సినిమాలకు సంగీతమే ప్రాణం. మ్యూజిక్ హిట్ కావడం, శాటిలైట్ అమ్ముడు పోవడం, సురేష్ ప్రొడక్షన్ విడుదల చేయడంతో సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా' అని మధుర శ్రీధర్ తెలిపారు. రాజ్కందుకూరి చెబుతూ, 'థ్రిల్లర్స్కిప్పుడు మంచి రోజులు. ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది. దర్శకుడిపై నమ్మకం ఉంది. సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. దర్శకుడు సుబ్బు వేదుల చెబుతూ, 'కన్వర్షన్ డిజార్డర్తో బాధపడే అమ్మాయికి రక్తం చూసినప్పుడు చీకటి ఆవహిస్తుంది. అంతేకాదు తన జీవితంలోనూ ఓ రాహు ఉంటాడు. మరి తనలోని రాహుతోపాటు తన జీవితంలోని రాహుతో ఎలా పోరాడిందనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుంది. కచ్చితంగా అందరికి నచ్చే చిత్రమవుతుంది' అని చెప్పారు. 'కొత్తవారితో ఈ చిత్రాన్ని రూపొందించాం. అందరు బాగా సపోర్ట్ చేశారు. సినిమాకి నాలుగు స్టెప్పులుంటాయి. ఒకటి సినిమా తీయడం, రెండు పోస్ట్ ప్రొడక్షన్, మూడు ప్రమోట్ చేసి విడుదల చేయడం. నాలుగు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం. మేం ఈ చిత్రంతో నాలుగో స్టెప్ వరకు చేరుకుంటామని ఆశిస్తున్నా' అని నిర్మాత స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్ అభిరామ్ వర్మ, కృతి గార్గ్, లిరిసిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.