Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'1980 ఫిబ్రవరిలో 'శంకరాభరణం' విడుదలైంది. ఈ సినిమాని ఇప్పుడు చూసినా నలభై ఏండ్లు వెనక్కి వెళ్ళిన అనుభూతి కలిగింది' అని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. ఆయన రూపొందించిన కళాఖండం 'శంకరాభరణం'. ఇది విడుదలై నలభై ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ పై విధంగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'మరో 'శంకరాభరణం', మరో 'సాగర సంగమం'లాంటి చిత్రాలను ప్రస్తుత దర్శకుల నుంచి ఆశించకూడదు. ఎందుకంటే కె.విశ్వనాథ్ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా. నేటి దర్శకుల నుంచి మళ్ళీ ఇలాంటి సినిమాలొస్తాయని ఎదురుచూసి భంగపడొద్దు. ఇలాంటి సినిమాలు రావు. తీసేవారు లేరు' అని అన్నారు. 'ఇలాంటి సినిమాని పాఠ్య గ్రంథంగా పెట్టి భవిష్యత్ దర్శకులకు ఎలాంటి సినిమాలు తీయాలో నేర్పాలి. నేటితరం ఈ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి' అని ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, ''శంకరాభరణం' లాంటి సినిమా తీయడం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం. కళాతపస్వి కె.విశ్వనాథ్గారు మనకందించిన ఈ చిత్రం చిరస్మరణీయం' అని చెప్పారు. చంద్రమోహన్ ఆ రోజుల్లో 'శంకరాభరణం'లో జరిగిన అనుభవాలను పంచుకుంటూ, 'మరో రెండు రోజుల్లో మా అన్నయ్య కె.విశ్వనాథ్ 90ల్లోకి అడుగిడుతున్నారు. ఆయన వంద పుట్టిన రోజులు జరుపుకోవాలి. 'శంకరాభరణం' యాభై ఏండ్ల ఫంక్షన్కి కూడా ఆయన రావాలి' అని ఆకాంక్షించారు. బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ, ''శంకరాభరణం' లాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం. ఎన్ని తరాలు మారినా ఇది తెలుగు సినిమా చరిత్రలో కలికితురాయిగా నిలుస్తుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెంటాల జయదేవ, డబ్బింగ్ జానకి, భీమేశ్వరరావు, వంశీ, కస్తూరి, ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్, దశరథ్, రచయిత ప్రవీణ్ వర్మ, తనికెళ్ళ భరణి, అశోక్ కుమార్, అనంత్, రమేష్ ప్రసాద్, అచ్చిరెడ్డి, మాధవపెద్ది సురేష్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.