Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా త్వరలోనే తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ని వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జ్వాల గుత్తా స్వయంగా తెలియజేశారు. 'అవును.. త్వరలోనే మా పెళ్ళి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత లేదా పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు అందరికీ అధికారికంగా తెలియజేస్తాం' అని ఆమె తెలిపారు. గత కొద్ది కాలంగా వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విష్ణు విశాల్, జ్వాల గుత్తా ఇద్దరూ తమ పెళ్ళి విషయంపై పూర్తి వివరణ ఇచ్చారు. విష్ణు విశాల్ కథానాయకుడిగా పలు తమిళ చిత్రాల్లో నటించారు. వీటిల్లో 'రటశాసన్' చిత్రాన్ని తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేశారు. ఈచిత్రం అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణ పొంది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఈ రీమేక్లో నటించారు. విష్ణు విశాల్ నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మించారు. తమిళనాట ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణం కూడా ఉంది. ఇదిలా ఉంటే, 2013లో రిలీజ్ అయిన 'గుండెజారి గల్లతయ్యిందే' చిత్రంలో జ్వాలగుత్తా ఓ స్పెషల్ సాంగ్లో కథానాయకుడు నితిన్ సరసన మెరిసిన విషయం విదితమే.