Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంకరమైన వైరస్ వచ్చిందని జనవరిలోనే తెలుసు
- అయినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం : వాషింగ్టన్ పోస్ట్ వార్తా కథనం
- నియంత్రణా చర్యలుంటే... లక్షల మంది ప్రాణాలు దక్కేవి..
వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలపకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కచ్చితమైన సమాచారముందని, అయితే వైరస్ మహమ్మారిగా మారిందనే విషయం అమెరికా ప్రజలకు ట్రంప్ తెలపకుండా కావాలనే దాచారని 'వాషింగ్టన్ పోస్ట్' వార్తా కథనం ప్రచురించింది. ప్రముఖ జర్నలిస్టు వుడ్వార్డ్కు టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ (ఫిబ్రవరిలో) చెప్పిన విషయాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషనాత్మక వార్తా కథనం వెలువరించింది. కరోనా మహమ్మారిగా మారిందన్న విషయం ఈ ఏడాది మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికి హెచ్చరికలు జారీచేసింది. మార్చి 11 కన్నా ముందే డొనాల్డ్ ట్రంప్నకు కరోనా వైరస్పై సమాచారం అందిందని, కావాలనే ఈ విషయాన్ని ఆయన ప్రజలకు వెల్లడించలేదని వార్తా కథనం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.. జర్నలిస్టు వుడ్వార్డ్ ఇంటర్వ్యూలతో కూడిన పుస్తకం 'రేజీ' ఈనెల 15 విడుదల కానున్నది. వైరస్ వ్యాప్తి గురించి అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారో ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ ఏడాది జనవరి 28న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు డొనాల్డ్ ట్రంప్నకు వైరస్ సమాచారాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి 7న వుడ్వార్డ్తో జరిగిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ వైరస్ ప్రస్తావన తీసుకొచ్చారు. కరోనా అత్యంత ప్రమాదకరమైన వైరస్గా ట్రంప్ చెప్పారు. వైరస్కు సంబంధించి కీలక సమాచారాన్ని అమెరికా నిఘా వర్గాలు ఫిబ్రవరిలో పలుమార్లు ట్రంప్నకు అందజేశాయి. చైనాలో వైరస్ వ్యాప్తి చెందిన తీరుపై ఫిబ్రవరి 2నే ట్రంప్నకు సమాచారం అందింది. అది వాస్తవమేనని అమెరికా అధికార వర్గాలు సైతం తేల్చిచెప్పాయి. అయినప్పటికీ వైరస్ వ్యాప్తిని ట్రంప్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసి, నియంత్రణ చర్యలు తీసుకోలేదు. కేవలం ఆర్థిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంటుందనే తాను వెల్లడించలేదని ట్రంప్ తన చర్యల్ని సమర్థించుకుంటున్నారు. అయితే ఇది నిజం కాదని, వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొన్నది.
చైనా, డబ్ల్యూహెచ్ఓపై ఆక్రోశం
ఆర్థిక వ్యవస్థ మూతపడితే రాజకీయంగా తనకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందనే అంచనాతో ట్రంప్ నియంత్రణ చర్యలు చేపట్టలేదనే ఆరోపణలున్నాయి. ట్రంప్ సర్కార్ తీరువల్ల అమెరికా అంతటా వైరస్ పాకింది. దాదాపు 63లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు (1,90,000) చోటుచేసుకున్నాయి. సమయానికి ట్రంప్ సర్కార్ మేలుకొని ఉంటే లక్షలమంది చనిపోయి వుండేవారు కాదని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జోయి బిడెన్ ఆరోపిస్తున్నారు. ఇది చేయకపోగా, చైనాపై, డబ్ల్యూహెచ్ఓపైన నెపం వేసి తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు.