Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్- బహ్రెయిన్ల ఒప్పందాన్ని ఖండించిన టర్కీ, ఇరాన్
ఇస్తాంబుల్ : ఇరుదేశాల మధ్య సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకని ఇజ్రాయిల్, బహ్రెయిన్లు కుదుర్చుకున్న తాజా ఒప్పందాన్ని టర్కీ, ఇరాన్ తీవ్రంగా ఖండించాయి. అమెరికా మధ్యవర్తిత్వం నెరిపిన ఈ డీల్ పాలస్తీనియన్ల ప్రయోజనాలకు పెద్ద దెబ్బ అని టర్కీ పేర్కొంది. ఇదే సమయంలో తమ ప్రాంతంలో అస్థిరతను రేకెత్తించేందుకు బహ్రెయిన్ ప్రయత్నిస్తోందని ఇరాన్ విమర్శించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఇజ్రాయిల్, బహ్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత నెల రోజుల్లోనే ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకున్న దేశంగా బహ్రెయిన్ నిలిచింది. ఇది తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, ఈ ఒప్పందాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టర్కీ విదేశాంగ శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా భూభాగాలను కాపాడుకోవడంలో ఇది విఘాతం కలిగిస్తుందని, పాలస్తీనా భూభాగాల విషయంలో ఇజ్రాయిల్ తన అక్రమాలను మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అరబ్ పీస్ ఇన్సియేటివ్(ఏపీఐ)లోని అంశాలకు ఈ ఒప్పందం పూర్తి విరుద్ధమని పేర్కొంది.
గల్ఫ్ ప్రాంతంలో ఏమైనా అభద్రతా పరిస్థితులు ఏర్పడితే అందుకు బహ్రెయిన్, దాని మిత్రపక్షాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఎన్నికల కోసం పాలస్తీనియన్లు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని విస్మరిస్తూ బహ్రెయిన్ సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందని విమర్శించింది.