Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ప్రధాని జాన్సన్ విమర్శ
లండన్/బెర్లిన్ : బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ మధ్య ఆహార ఆక్షలు విధించడం ద్వారా బ్రిటన్ను చీల్చడానికి యురోపియన్ యూనియన్ బెదిరిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. దీంతో ఇప్పటికే ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న బ్రెగ్జిట్ చర్చలపై సరికొత్తగా ఆజ్యాన్ని చల్లినట్లు అయింది. ఇయు తీసుకున్న ఈ వైఖరితో బ్రెగ్జిట్ నుండి వైదొలగే ఒప్పందాన్ని తిరిగి రూపొందించడానికి కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని తమ ప్రభుత్వం భావించడం సరైనదేనని స్పష్టమవుతోందని టెలిగ్రాఫ్ దినపత్రికకు రాసిన వ్యాసంలో జాన్సన్ పేర్కొన్నారు. ఈ బ్రెగ్జిట్ బిల్లు మాజీ ప్రధానులు, ఆయన సొంత ఎంపీల్లో ఆందోళనకు కారణమవుతోంది. భవిష్యత్ వాణిజ్య సంబంధాలపై బ్రిటన్, ఇయు మధ్య జరుగుతున్న చర్చలు ప్రతిష్టంభనకు గురయ్యాయి. బెర్లిన్లో ఇయు సమావేశం అనంతరం జర్మన్ ఆర్థిక మంత్రి ఓల్ఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ, నియంత్రణ లేని పరిస్థితి (ఒప్పందం కుదరని) వల్ల బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పర్యవసానాలు వుండగలవన్నది తన అంచనా అని హెచ్చరించారు. అయితే, ఈ పరిస్థితిని యూరప్ ఎదుర్కొనగలదని, ఇప్పటికే తాము చేసుకున్న ఏర్పాట్లు వల్ల కష్టమైన పర్యవసానాలు వుండబోవని అన్నారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చే ఈ ఏడాది చివరి నాటికి కూడా ఒప్పందం కుదరకపోతే జనవరిలో కుదుర్చుకున్న ఉపసంహ రణ ఒప్పందం ప్రకారం ఉత్తర ఐర్లాండ్కు తీవ్ర స్థాయిలో నిబంధనలను అమలు చేయడానికి ఇయు చూస్తోందని జాన్సన్ పేర్కొన్నారు. గ్రేట్ బ్రిటన్ నుండి ఉత్తర ఐర్లాండ్కు వెళ్ళే వస్తువులపై టారిఫ్లు విధించడమే కాకుండా, మొత్తంగా ఆహార ఉత్పత్తుల రవాణా నిలిపివేయ వచ్చని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల ద్వారా కుదిరిన ఒప్పందాన్ని బ్రిటన్లో ఒక భాగంపై ఆంక్షలు విధించడానికి లేదా బ్రిటన్ ఆర్థిక, ప్రాదేశిక సమగ్రతను నాశనం చేయడానికి ఒక బెదిరింపుగా ఇయు ఉపయోగిస్తుందని తామెన్నడూ అనుకోలేదని అన్నారు. ఇయు వైఖరి ఉత్తర ఐర్లాండ్ శాంతి సుస్థిరతలకు తీవ్రమైన ముప్పుగా పరిణమించేలా వుందని జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.