Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు బోజ్కిర్
- ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు దాటిన కరోనా కేసులు
న్యూయార్క్: ఏ దేశం కూడా కరోనా వైరస్పై ఒంటరిగా పోరాడి విజయం సాధించలేదని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షడు వోల్కాన్ బోజ్కిర్ అన్నారు. దేశాలు తమ నిర్ణయాల్లో 'భౌతిక దూరం' పాటిస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తే మహమ్మారి మరింత బలపడుతుందన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, రాయబారులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. 'ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు బహుళపక్ష విధానమే మందు' అని చెప్పారు. ప్రపంచమంతా కలిసికట్టుగా కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చారు. 75 ఏండ్లుగా ఐక్యరాజ్యసమితి ప్రాథమ్యాలుగా ఉన్న అంశాలు ఈ 6 నెలల్లో పూర్తిగా మారిపోయాయని చెప్పారు. మనం అత్యంత తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని మన మాస్కులు నిరంతరం గుర్తు చేస్తున్నాయనీ, అదే సమయంలో మనమంతా ఒక్కటేనని చెప్తున్నాయన్నారు. అలాగే, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఒకే ముప్పు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ప్రాణాలను కాపాడటం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని అన్ని దేశాలకూ పిలుపునిచ్చారు. 'చాలామంది వ్యాక్సిన్పైనే ఆశలు పెట్టుకున్నారు. మహమ్మారిలు విజంభించినప్పుడు సర్వరోగనివారిణి అనే ఔషధం ఉండదు. కేవలం వ్యాక్సిన్ ఒక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం చూపించద'ని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు దాటిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా జాన్ హప్కిన్స్ వర్సిటీ వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,05,186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,616 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో అన్ని దేశాల్లో కలిపి మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,01,03,226కు చేరింది. మరణాల సంఖ్య 9,46,250కి పెరిగింది. ప్రస్తుతం 73,01,667 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 68,30,629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,01,411 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది. మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 44,21,686 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 1,34,174 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటి తర్వాతి స్థానంలో ఉన్న రష్యాలో 1,79,519 కేసులు, పెరూలో 7.38 లక్షలు, కొలంబియాలో 7.3 లక్షలు, మెక్సికోలో 6.76 లక్షలు, దక్షిణాఫ్రికాలో 6.53 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
చిన్నారులు, టీనేజర్లపై కరోనా క్లీనికల్ ట్రయల్స్: చైనా
తాము తయారు చేసిన కరోనా టీకాను సెప్టెంబర్ 28 నుంచి పిల్లలు, టీనేజర్లపై పరీక్షించి చూస్తామని చైనా సంస్థ సైనోవాక్ ప్రకటించింది. తొలి, రెండో దశ క్లీనికల్ ట్రయల్స్ను ఉమ్మడిగా నిర్వహిస్తున్న సంస్థ..ఈ అధ్యయనం కోసం మూడు నుంచి 17 ఏండ్ల మధ్యనున్న 552 మంది పేర్లను నమోదు చేసుకుంది. అయితే.. ప్రయోగదశలో ఉన్న ఈ టీకాను సైనోవాక్.. సంస్థలోని 90 శాతం మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఇచ్చింది. టీకాకు సంబంధించిన పెద్దలపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం.
వ్యాక్సిన్తో ఆ దుష్ప్రభావాలు ఊహించినవే: రష్యా ఆరోగ్య మంత్రి
రష్యా ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వీ'పై ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆశలు పెట్టుకున్న తరుణంలో.. తాము తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్ తాము ఊహించినవేనని ఆయన అన్నారు. అవి సాధారణంగా ఒకటిన్నర రోజుల్లో పోతాయని తెలిపారు.