Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఐదేండ్లు పట్టొచ్చు
- పెరిగిన పేదరికం : ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కార్మెన్ రెన్హర్ట్
న్యూయార్క్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కార్మెన్ రెన్హర్ట్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేశారు. గురువారం స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేస్తే వేగంగా వృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ పూర్తి స్ధాయిలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మాత్రం ఐదేండ్ల సమయం పట్టొచ్చన్నారు. కరోనా సంక్షోభంతో నెలకొన్న మందగమనం కొన్ని దేశాల్లో అత్యధిక కాలం కొనసాగవచ్చన్నారు. ఆయా దేశాల రికవరీలోనూ అసమానతలు ఉంటాయన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా నష్టపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం వల్ల గడిచిన 20 సంవత్సరాల్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పేదరిక శాతం పెరిగిందన్నారు. వైరస్ విస్తృతి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ జీడీపీ మైనస్ 4.5 శాతం క్షీణించే అవకాశాలున్నాయని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తాజాగా హెచ్చరించింది. భారత జీడీపీ ఏకంగా 10.2 శాతం ప్రతికూల వృద్థిని చవి చూడొచ్చని అంచనా. బ్రిటన్ 10.1 శాతం, ఫ్రాన్స్ 9.5 శాతం, రష్యా 7.3 శాతం, బ్రెజిల్ 6.5 శాతం, జపాన్ 5.8 శాతం, అమెరికా 3.8 శాతం చొప్పున ప్రతికూల వృద్థిని చవి చూడొచ్చని అంచనా వేసింది. అన్ని దేశాలకు భిన్నంగా చైనా జీడీపీ మాత్రం 1.8 శాతం పెరుగుదలను నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు ఇతర దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల స్థాయిలో జీడీపీ క్షీణతను చవి చూడనుందని ఇప్పటికే అనేక అంతర్జాతీయ, జాతీయ ఏజెన్సీలు అంచనా వేశాయి. జూన్తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి కుప్పకూలిన విషయం తెలిసిందే.