Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : ప్రపంచంలో అమెరికా యుద్దాల కారణంగానే దాదాపు 6కోట్ల మంది నిర్వాసితులయ్యారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ వ్యాఖ్యానించారు. సామ్రాజ్యవాదం, దాని మిలటరీ పరిశ్రమ పర్యవసానాల కారణంగా లక్షలాదిమంది ప్రజలు కడగండ్ల పాలవుతున్నారని రొడ్రిగజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ''శరణార్ధులను సృష్టించడం : సెప్టెంబరు 11 దాడుల అనంతరం అమెరికా కారణంగా నిర్వాసితులైనవారు'' అనే అంశంపై ఇటీవలనే ప్రచురి తమైన నివేదికను ప్రస్తావిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వనరులన్నింటినీ దోపిడీ చేస్తూ సామ్రాజ్యవాద వ్యవస్థ సంక్షేమాన్ని కూడా విక్రయి స్తోందని రొడ్రిగజ్ వ్యాఖ్యానించారు.
ఆ యుద్ధాల కారణంగా దాదాపు 3కోట్ల 70లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని బ్రౌన్ యూనివర్శిటీ వెలువరించిన ఈ నివేదిక పేర్కొంది. అయితే ఇది సరైన సంఖ్య కాదని ఇంకా ఎక్కువే వుండవచ్చునని నివేదిక భావించింది. 20వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన ఏ ఘర్షణల్లోనూ ఇంత భారీ సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాలేదని పేర్కొంది. కేవలం రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన 1939-1945 మధ్య కాలంలో మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు.
2001 సెప్టెంబరు 11 దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తీవ్రవాదంపై ప్రపంచ పోరాటం పేరుతో యుద్దాలు చేపట్టారు. అందులో భాగంగానే, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లపై అమెరికా యుద్ధాలకు దిగింది. రసాయన ఆయుధాలు వున్నాయన్న సాకుతో ఇరాక్పై యుద్ధానికి దిగి తర్వాత అవేమీ లేవని తేల్చింది. శరణార్ధుల వారీగా చూసినట్లైతే ఆఫ్ఘనిస్తాన్(53లక్షలు), ఇరాక్(92లక్షలు), పాకిస్తాన్(37లక్షలు), యెమెన్ (44లక్షలు), సోమాలియా(42లక్షలు), లిబియా (12లక్షలు), సిరియా(71లక్షలు) శరణార్ధులు వున్నారు.