Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షణ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పిలుపు
బ్యూనస్ ఎయిర్స్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ప్రాణాన్ని కాపాడేందుకు గొంతు కలపాలంటూ అర్జెంటీనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆడాల్ఫో పెరెజ్ ఎసెక్వివల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికాకు అసాంజెను అప్పగిస్తే అది ఆయనకు మరణ శిక్ష విధించినట్లేనని అన్నారు. అసాంజెను రక్షించేందుకు మనందరం గొంతు కలపకపోతే ప్రపంచంలో సమాచార స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతుందనీ, అందువల్ల మనస్సాక్షితో ప్రపంచ మీడియా, జర్నలిస్టులందరూ ఇందుకు పూనుకోవాలని కోరారు. లండన్లో గత 17మాసాలుగా జైల్లో వున్న అసాంజె బహిరంగ విచారణను ఎదుర్కొంటున్నారు. అమెరికా దౌత్యం, సైన్యానికి సంబంధించి వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్లో విడుదల చేసినందుకు ఆయన ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల్లో అమెరికా చేసిన యుద్ధనేరాలకు సంబంధించిన ఫైళ్ళు కూడా ఇందులో వున్నాయి. లండన్లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆరేండ్లు ఆశ్రయం పొందిన తర్వాత అసాంజెను ఆ ప్రభుత్వం బ్రిటీష్ పోలీసులకు అప్పచెప్పింది. ఈ సమయంలోనే అర్జెంటీనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త అయిన పెరెజ్, అసాంజెను కలిశారు. ప్రస్తుతం అసాంజె తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఆయన ఎదుర్కొంటున్న గూఢచర్యం ఆరోపణలపై అమెరికా విచారణ జరిపి 175ఏండ్లు జైలు శిక్ష విధించే అవకాశం వుందని అన్నారు. అంటే ఇక మరణశిక్షతో సమానమేనని వ్యాఖ్యానించారు.