Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో చికిత్సపొందుతూ అస్తమయం
మాలియా: కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా(91) కన్నుమూశారు. రాజు ఇకలేరన్న విషయాన్ని అమీర్ దివాన్ డిప్యూటీ మినిస్టర్ షేక్ అలీ అల్ జర్రా అల్ సబా వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం జులై 18న అమిర్ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అనంతరం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందన్నారు. జులై 23న అమెరికా వెళ్లి వైద్య చికిత్స తీసుకున్నారని తెలిపారు. అయితే, ఆయనకు శస్త్ర చికిత్స ఎందుకు జరిగింది? అమెరికాలో వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను మాత్రం కార్యాలయం వెల్లడించలేదు. అయితే, షేక్ సబా అల్ అహ్మద్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అహ్మద్ అల్ సబా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం. షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా జనవరి 29, 2006లో అమిర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సోదరుడు, కువైట్కు రాజుగా ఉన్న షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ సబా ఈయన్ను 2003లో ప్రధానమంత్రిగా నియమించారు. దీంతో అల్ సబా రాజవంశం నుంచి షేక్ సబా అల్ అహ్మద్ 15వ పరిపాలకుడిగా ఉన్నారు. 1963 - 2003 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు 40ఏండ్ల అనుభవం ఉంది. ఈ సమయంలోనే కువైట్ విదేశాంగ విధానం రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. అరబ్ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తగా, గొప్ప మానవతావాదిగా మన్ననలు పొందారు.