Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా పరిశోధనలో వెల్లడి
హ్యుస్టన్ : రెండోసారి కరోనా బారిన పడితే..ఆ వ్యాధి లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉండవచ్చునని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి బారి నుండి ఒకసారి బయటపడినవారు ఇక తమకేమీ కాదని అనుకోవడానికి వీల్లేదని, వారు కూడా మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి అలవాట్లను కొనసాగించాల్సిందేనని చెప్పారు. రెండవ సారి కరోనా బారిన పడిన వ్యక్తి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నెవెడా విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అమెరికాలో రెండవ సారి కరోనా బారిన పడిన కేసును ధ్రువీకరించారు. 25 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఎలాంటి రుగ్మతలు లేనప్పటికీ..48 రోజుల్లోనే రెండవ సారి కరోనా బాధితుడయ్యారు. మొదటి సారి కరోనా సోకి.. సురక్షితంగా బయటపడ్డాక అతడిలో తీవ్ర అనారోగ్య లక్షణాలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా రెండవ సారి కోవిడ్-19 సోకింది. అప్పటికే తీవ్ర జ్వరం, తలనొప్పి, దగ్గు, డయేరియా వంటి సమస్యలు తలెత్తడంతో ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి తొలిసారి తీసుకున్న ట్రీట్మెంట్ రెండవసారి కరోనా బారిన పడకుండా చేస్తుందనుకోవడం సరికాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వైరస్, మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మార్క్ ఫాండోరి చెప్పారు.