Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి పలు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కొత్త విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించాయి. హెచ్1-బీ వీసాల జారీపై అదనపు ఆంక్షలు విధిస్తూ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ' (డీహెచ్ఎస్) ఇటీవల ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వీసాల పరిధిలోకి వచ్చే ప్రత్యేక నైపుణ్యాలను కుదించింది. ఈమేరకు ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనంలో మార్పులు చేసింది. పాత వీసా విధానంలోని లొసుగులను తాజా మార్పులు సరిదిద్దుతాయని డీహెచ్ఎస్ అభిప్రాయపడింది. వీసా విధానంలో చేసిన తాజా మార్పులు 60 రోజుల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాజాగా 17మంది ప్రముఖులు, సంస్థలు కొలంబియా డిస్ట్రిక్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వీటిలో పలు విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. హెచ్-1బీ వీసాదారుల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోవడం లేదని..పైగా వారివల్లే ఉద్యోగ సృష్టి జరుగుతోందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. కొత్త నిబంధనల వల్ల విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అంకుర సంస్థలు, చిరు వ్యాపారాలు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కోవిడ్-19 సంక్షోభంలో మార్కెట్ను, అమెరికా ఉపాధి మార్గాల్ని సరిగా అవగాహన చేసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వెలువడుతున్నాయని అభిప్రాయపడ్డారు.