Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీళ్ళందరూ ఇడియట్లని దుర్భాష
వాషింగ్టన్ : అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు, నివారణ సంస్థ డైరక్టరైన డాక్టర్ ఆంథోనీ ఫౌసిపై అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య రీతిలో దాడి చేశారు. దేశంలో 2.2లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కరోనా వైరస్ను పారద్రోలే విషయంలో ఈ 'ఇడియట్' లు చెప్పేది వినివినీ అమెరికన్లు విసిగిపోయారని ఆయన అనడం కలకలం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు విమర్శలుచేస్తున్నారు. వచ్చే నెల 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కరోనా అంశమే హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లాస్వేగాస్లో మాట్లాడిన ట్రంప్ ''కొవిడ్తో ప్రజలు విసిగిపోయారు. ఇక మీరు చెప్పేది వినలేం. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి, ఫౌసితో సహా ఈ ఇడియట్లందరూ చెప్పేది విని ప్రజలకు కూడా విసుగు వచ్చింది.'' అని అన్నారు. ఫౌసిని ''విఫలమైన వ్యక్తి''గా అభివర్ణించారు. ఒకవేళ ఆ వ్యక్తిని తాను తొలగిస్తే తనపై వ్యతిరేకత పెరుగుతుందని చెప్పారు.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై సుప్రీం విచారణ
ట్రంప్ ప్రభుత్వ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాలపై దాఖలైన పిటిషన్లను అమెరికా సుప్రీం కోర్టు విచారించనుంది. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి సైనిక నిధులు వినియోగించడం, ఆశ్రయం కోరేవారు మెక్సికోలోనే వుండాలని, వారి కేసులు మాత్రం అమెరికా కోర్టుల్లో విచారించాలని తీసుకువచ్చిన విధానాలు వివాదాస్పదంగా మారాయి. ఈ రెండు కేసుల్లో ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టు రివ్యూను కోరింది. మెక్సికో నుండి అమెరికాలోకి వలసలను అడ్డుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న యత్నాలను ఫెడరల్ కోర్టులు తిరస్కరించడంతో ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళింది. సరిహద్దు గోడ నిర్మాణానికి పెంటగన్ నిధులు మళ్ళించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంటూ జూన్లో 9వ సర్క్యూట్ అప్పీళ్ళ కోర్టు 2-1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వలస ప్రజల రక్షణ ఒప్పందాలు (ఎంపీపీ) పేరుతో తీసుకువచ్చిన విధానం కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాలిఫోర్నియాలోని దిగువ ఫెడరల్ కోర్టులు రూలింగ్ ఇచ్చాయి. పైగా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నాయి. కాగా అమెరికా దక్షిణ సరిహద్దులో వలసల సంక్షోభాన్ని తగ్గించడానికే ఈ విధానమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.