Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంటగన్ చీఫ్ వెల్లడి
వాషింగ్టన్ : రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు క్షిపణి రక్షణ వ్యవస్థను మెరుగుపరచనున్నట్లు పెంటగన్ చీఫ్ మార్క్ ఎస్పర్ తెలిపారు. మధ్య, స్వల్ప శ్రేణి క్షిపణుల సంఖ్యను పెంచాలని కూడా భావిస్తున్నట్లు చెప్పారు. అట్లాంటిక్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను చైనా, రష్యాలు విస్తృతంగా అభివృద్ధిపరిచాయని చెప్పారు. పైగా, ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ రష్యా వీటిని అభివృద్ధిపరిచిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రష్యా, చైనాలను అడ్డుకోవడానికి అమెరికా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇతర దేశాలతో మిత్రత్వ సంబంధాలను కూడా పటిష్టపరుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆయుధ వాణిజ్యాన్ని ఆధునీకరించనున్నట్లు చెప్పారు. చైనా, రష్యా రక్షణ పరిశ్రమలతో అమెరికా పోటీ పడాలని ఎస్పర్ పేర్కొన్నారు. తృతీయ ప్రపంచ దేశాల్లో ఆ దేశాల మార్కెట్ వాటాలు పెరగకుండా నివారించనున్నట్లు తెలిపారు. ఈనాడు అమెరికాకు అతి ప్రధానమైన వ్యూహాత్మక ప్రత్యర్ధులు ఎవరంటే రష్యా, చైనానే అని గతంలో రక్షణ మంత్రి పేర్కొన్నారు.