Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చావడమెలాగో నేర్చుకుంటున్నాం: బిడెన్
వాషింగ్టన్ : కోవిడ్ తో కలిసి బతకడమెలాగో అమెరికన్లు నేర్చుకోవడం లేదని, దానితో చనిపోవడమెలాగో నేర్చుకుంటున్నారని డెమొక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, కరోనా తగ్గుతున్న సూచనలు కూడా ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 2,20,000 మంది అమెరికన్లు మరణించారని, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో ఇవి, ఐదో వంతు కన్నా ఎక్కువగా వున్నాయన్నారు. ట్రంప్తో కలిసి తుది విడత చర్చలో పాల్గొన్న మరుసటి రోజు బిడెన్ కరోనా వైరస్పై విధానపరమైన ప్రసంగం చేశారు. తన స్వంత రాష్ట్రమైన డెల్వార్లో తన నివాసం నుంచి ఈ ప్రసంగం చేశారు. ట్రంప్ విధానాల వల్ల వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిందని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నారు. ''కరోనాను పారదోలుతున్నామని, దానితో కలిసి జీవించడమెలాగో నేర్చుకున్నామని'' ట్రంప్ చెబుతున్నారు కానీ, మనం దానితో కలిసి జీవించడం నేర్చుకోలేదని, చనిపోవడమెలాగో నేర్చుకుంటున్నామని తాను ట్రంప్తో గత రాత్రి చెప్పానని బిడెన్ పేర్కొన్నారు. మన ముందున్నది అత్యంత దుర్భరమైన శీతాకాలమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2,20,000 మంది చనిపోయారని, అయితే, కొలంబియా యూనివర్శిటీ జరిపిన తాజా అధ్యయనంలో తేలిందేమంటే ఇందులో లక్షా 30వేల నుండి 2,10,000 మధ్య మరణాలు నివారించగలిగేవేనని పేర్కొందన్నారు. ఇటీవల చరిత్రలో మనం ఎదుర్కొన్న అనేక పరిస్థితుల కన్నా కరోనా చాలా భయంకరమైనదని అన్నారు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఈ వైరస్ తీవ్రంగా ప్రబలుతున్నదని అన్నారు.
దీనిపై పోరాడేందుకు ట్రంప్ వద్ద నిర్దిష్ట ప్రణాళిక లేనే లేదని బిడెన్ విమర్శించారు. అధ్యక్షుడుగా అప్రమత్తంగా వుండాల్సింది పోయి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఖైదీల్లాగా బందీలు కాబోమని, భిన్నమైన పంథాను మనం ఎంచుకుందామని అన్నారు. అమెరికన్లు ఎప్పుడూ చేసేదే మనం చేద్దాం. అందరం కలిసికట్టుగా వుండి ఈ సవాలును కృతనిశ్చయంతో, ధైర్యంగా ఎదుర్కొందామని బిడెన్ పిలుపిచ్చారు. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే, కరోనాను ఎదుర్కొనేందుకు తక్షణమే అమల్లోకి వచ్చేలా జాతీయ వ్యూహాన్ని అమలు చేస్తానని చెప్పారు.