Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పడిపోయిన కేసుల నమోదు
- డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడి
న్యూయార్క్ : భారత్లో మలేరియా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ మలేరియా నివేదిక-2020ను తాజాగా విడుదల చేశారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 229 మిలియన్ల కేసులు నమోదైనట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది ఈ వ్యాధితో 4,09,000 మంది మరణించగా, 2018లో 4,11,000 మంది చనిపోయారు. 'కేసుల నమోదులో 73 శాతం, మరణాల్లో 74 శాతం తగ్గుదలతో అగేయ ఆసియా దేశాలు బలమైన పురోగతి ప్రదర్శిస్తున్నాయి. కేసుల సంఖ్యలో భారీ తగ్గుదలతో వ్యాధి నివారణలో చిత్తశుద్ధి కనబర్చిందని డబ్ల్యుహెచ్ఓ అభిప్రాయపడింది. ఇక్కడ కేసులు 20 మిలియన్ల నుంచి 6 మిలియన్లకు తగ్గాయి' అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మలేరియాపై పోరాటంలో భారత్ 'ఆకట్టుకునే లాభాలు' కనబరుస్తుందని చెప్పారు. ఇక్కడ గత రెండేండ్లలో కేసుల్లో 18 శాతం, మరణాల్లో 20 శాతం తగ్గుదల ఉందని అన్నారు.
అలాగే 2000 నుంచి 2019 కాలంలో మరణాల్లో భారత్లో భారీ తగ్గుదల ఉందని అధనోమ్ చెప్పారు. 2000లో మలేరియాతో 29,500 మంది మృతి చెందగా, గత ఏడాది 7,700 మంది మరణించారు. అయితే 2019 అగేయ ఆసియా దేశాల కేసుల్లో 88 శాతం, మరణాల్లో 86 శాతం భారత్కు చెందినవే. ప్రతీ ఏటా లక్షల మందిని బలిగొంటున్న మలేరియాపై పోరాటానికి దేశాలకు, ప్రపంచ ఆర్యోగ భాగస్వామ్యులకు డబ్ల్యూహెచ్ఓ పిలునిచ్చింది. ప్రపంచంలో ఆఫ్రికా దేశాలు మలేరియాతో ఎక్కువగా బాధపడుతున్నాయని తెలిపింది. ప్రపంచ కేసుల్లో 70 శాతం, మరణాలు 71 శాతం ఆఫ్రికా దేశాల్లోనే సంభవిస్తున్నాయని తెలిపింది.