Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్ర్ర్రపంచాన్ని వణికించిన 2020
- అమెరికాలో నిరసనల హోరు
- ఆసిస్లో జంతువుల్ని వేటాడిన కార్చిచ్చు
- ఈ ఏడాదంతా..ఆర్థికమాంద్యం, ఆరోగ్య సమస్యలు
మూడో ప్రపంచ యుద్ధం రాలేదు. గ్రహశకలాలు భూమిని ఢకొీనలేదు. కానీ...అంతకు
మించి జరిగిపోయింది. కంటికి కనిపించని అత్యంత సూక్ష్మజీవి మానవాళిని ఉతికి
ఆరేసింది. ఇందుకు 2020 వేదికైంది. ఏడాదిఅంతా కరోనా ముచ్చట్లతో గడిచిపోయింది.
వ్యాక్సిన్ వచ్చింది..హమ్మయ్య..అని ఊపిరి పీల్చుకుం టున్నాం. కానీ ఎక్కడో ఏదో
భయముంది. కరోనా మహమ్మారి మనల్ని ఇంకా వెంటాడుతోంది.
కరోనా కట్టడిలో చైనా
ప్రభుత్వ వైద్యరంగాన్ని నమ్ముకుంటే ఎంత గొప్ప ఫలితాలొస్తాయో సంక్షోభ సమయాన చైనా ప్రపంచానికి చేసి చూపింది. కరోనా విజృంభిస్తున్నదని తెలిశాక..జిన్పింగ్ సర్కార్ అఘామేఘాల మీద తీసుకున్న చర్యలు సత్ఫలితాల నిచ్చాయి. రోజుల వ్యవధిలోనే వేలమందికి చికిత్సనందించేలా కరోనా ఆస్పత్రి నిర్మాణం మొదలుకుని...ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్..సూత్రాన్ని చైనా పాటించింది. చివరికి ప్రపంచదేశాలూ చైనాను అనుసరించక తప్పలేదు. వైరస్ను సకాలంలో కట్టడిచేశాక..ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నట్టు ఆర్థిక నిపుణులు ధ్రు వీకరిస్తున్నారు. ఈ ఏడాది వీలైనంత తొందరగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలని ప్రపంచం కోరుకుంటోంది.
40కోట్ల ఉద్యోగాలు ఊస్ట్...
కరోనా మహమ్మారికి ముందే ప్రపం చాన్ని ఆర్థికమాంద్యం చుట్టుముట్టిందని ఆర్థికవేత్తల అభిప్రాయం. కరోనా రావటం వల్ల ..మాంద్యం మరింత వేగవంతమైందనీ, పాలకులు తమ తప్పులన్నీ వైరస్పై నెట్టేస్తున్నారని వారు చెప్పారు. కరోనా కారణంగా భూమిపై ఉన్న ప్రతీ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. '1930 గ్రేట్ డిప్రెషన్' తర్వాత ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే. దాదాపు 40కోట్ల ఫుల్టైమ్ ఉద్యోగాలు పోయా యని 'అంతర్జాతీయ కార్మిక సంఘం' అంచనావేసింది. సెప్టెంబరు 2020 నాటికి కార్మికుల వేతనాలు 10శాతం పడిపోయాయి. ఇది 3.5 ట్రిలియన్ డాలర్లకు(సుమారుగా రూ.256 లక్షల కోట్లు) సమానం. దాదాపు 8కోట్లమంది వైరస్బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలమంది వైరస్సోకి మరణించారు.
పశ్చిమాసియా
అరబ్ దేశాలకు, ఇజ్రాయిల్కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత ఘోరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే ఈ ఏడాది కొన్ని అరబ్ దేశాలకు, ఇజ్రాయిల్కు మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది.యూఏఈతో ఇజ్రాయిల్ శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే బహ్రెయిన్, సూడాన్, మొరాకోతో కూడా సాధారణ సంబంధాలు, స్నేహం ఏర్పడే విధంగా ఒప్పందాలు కుదిరాయి. టెలీ అవీవ్ (ఇజ్రాయిల్)తో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సౌదీ అరేబియా సైతం తెరవెనుక ప్రయత్నాలు చేసింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ను ఒంటరి చేయాలన్న వ్యూహంలో భాగంగానే ఈ శాంతి ఒప్పందాలు కుదిరాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకోసం అమెరికా పావులు కదిపిందని వారు చెప్పారు. ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలు...ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా మారకుండా చేయటమే అమెరికా, ఇజ్రాయిల్ వ్యూహమని సమాచారం.
కరోనా,అవినీతి ఆరోపణలతో ఇజ్రాయిల్ ప్రధానికి రాజీనామా
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దయింది. కేవలం ఏడు నెలలకే నెతన్యాహు సర్కార్ కుప్పకూలింది. బడ్జెట్ను ఆమోదించటంతో ప్రభుత్వం విఫలం కావటంతో పడిపోయింది. కరోనాతో పాటు అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయిన నెతన్యాహు గద్దె దిగకతప్పలేదు. 2019 ఏప్రిల్ నుంచి మూడుసార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మేలో లికుడ్ పార్టీ (నెతన్యాహు)బ్లూ అండ్ వైట్ పార్టీ (బెన్నీ గాంటై) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
నేపాల్ ప్రభుత్వం రద్దు
నేపాల్లోనూ అనుహ్యమైన పరిణామాలు చోటుచేసు కున్నాయి. నేపాల్ పార్లమెంట్ లో ప్రతినిధుల సభ రద్దయింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ సభను రద్దు చేసి, రాష్ట్రపతికి పంపగా ఆమోదించారు. ఏప్రిల్ 30, మే 10న రెండు విడతల్లో పోలింగ్ జరగనున్నది. ఈ నిర్ణయంపై నేపాల్ లో నిరసనలు భగ్గుమంటున్నాయి.
ట్రంప్ కు టా..టా..
ఈసారి జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా-నేనా అన్నట్టు సాగాయి. ఆర్థికమాంద్యం, జాతివివక్ష, అసమానతలు, కరోనా దెబ్బ..ఇదంతా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపింది. ఎంతో ధనిక దేశం, అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న అమెరికా కరోనా సంక్షోభం ముందు నిలవలేకపోయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి పోతేగానీ..పరిస్థితి మారదని సగటు అమెరికన్ భావించారు. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి..జో బైడెన్ వైపు మొగ్గుచూపారు. అమెరికా ఆధిపత్య ధోరణి ఆ దేశానికి ఎంతో నష్టం, కష్టం తెచ్చిపెట్టింది. ఇది గ్రహించిన బైడెన్ డబ్ల్యూహెచ్ఓలో కృత్రిమ నిధులు కొనసాగిస్తామనీ, పారిస్ పర్యావరణ ఒప్పందంలో మళ్లీ చేరుతామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. ఇక ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా..అమెరికాలో కరోనా విజృంభించిందనీ, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆరోపలు చేశారు.
పారిస్లోనూ ఆగ్రహజ్వాలలు..
పారిస్లో భద్రత బిల్లుకు వ్యతిరేకంగా దేశ ప్రజానీకం భారీ నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. ఆ బిల్లు అమలైతే పోలీసులకు అడ్డుఅదుపు ఉండదని గళమెత్తారు. ప్లకార్డులు, నినాదాలతో హౌరెత్తించారు. నిరసనకారులను అడ్డుకోవటానికి భద్రతాబలగాలు రెచ్చిపోయాయి. లాఠీలు..బాష్పవాయుగోళాలు ప్రయోగించాయి.
బ్లాక్ లైవ్స్ మ్యాటర్..
ఇది నల్లజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా లేచిన ఉద్యమం. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో శ్వేతజాతి దురహంకారం మరింత పడగవిప్పింది. దీనిపై అక్కడి ప్రజాస్వామ్యవాదులు, హక్కుల నేతలు ఎక్కుపెట్టిన ఉద్యమం 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'. జార్జ్ ఫ్లాయిడ్ హత్య (మే 25) ఘటన తర్వాత ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. అమెరికాలో ప్రతిరోజూ ఏదో ఒక నగరంలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' నిరసనలు చోటుచేసుకున్నాయి. జూన్ 6నాటికి నిరసనలు పెద్దఎత్తున విస్తరించాయి. 1960లో పౌర హక్కుల నిరసనలు తర్వాత ఆ స్థాయిలో అమెరికాలో ఆందోళనలు సాగాయి.
బీరూట్ పేలుడు...
లెబనాన్ రాజధాని బీరూట్లో ఈ ఏడాది ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 200మందికిపైగా చనిపోయారు. బీరూట్ నౌకాశ్రయానికి సమీపంలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిల్వ చేసిన 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలుడుకు దారితీసింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైప్రస్, టర్కీ, సిరియా, ఇజ్రాయిల్, యూరప్లోని కొన్ని నగరాలకు పేలుడు శబ్ధం వినిపించింది. అమెరికా జియోలాజికల్ సర్వేవారు ఈ ఘటనను మొదట భూకంపంగా భావించారు. రిక్టర్ స్కేల్పై 3.3 నమోదైంది. మానవ చరిత్రలో అణుబాంబు రహిత అతిపెద్ద పేలుడు ఇది.
అడవులు అగ్గిపాలు
మైదానప్రాంతాల్లో మనుషుల్ని కరోనా వెంటాడితే, అడవుల్లో జంతువుల్ని కార్చిచ్చు వేటాడింది. 2020లో ఆస్ట్రేలియా అడవుల్ని చుట్టుముట్టిన అగ్ని.. సామాన్యమైంది కాదు. న్యూ సౌత్వేల్స్ ప్రావిన్స్లో 26 సార్లు కార్చిచ్చు చెలరేగింది. విలువైన జంతు, వృక్ష సంపదతో కూడిన 1.86 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రకృతి విలయం వల్ల 103 బిలియన్ డాలర్ల (సుమారుగా 7.5 లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని సమాచారం. మూగ జీవాలు, అత్యంత అరుదైనవి..వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం...అందరి మనసుల్ని కలిచివేసింది.
బ్రిటన్ ఎగ్జిట్..
ఈ ఏడాది జనవరి 31నాటికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ అధికారికంగా బయటకు వచ్చేసింది. అయితే బ్రిటన్కు అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈయూలోని ప్రతి ఒక్కదేశంతో వేరు వేరుగా ఒప్పందం చేసుకోవాలి. దీనికి సంబంధించి చర్చలు ఎడతెగకుండా సాగాయి. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ జీడీపీ 4.5శాతం తగ్గుతుందనీ, తలసరి ఆదాయం 10శాతం పడిపోతుందని గణాంకాలు విడుదలయ్యాయి. ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు, కంపెనీలు క్రమంగా లండన్ నుంచి తరలిపోయే అవకాశముంది.