Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా : ఇండొనేషియా విమానం జకార్తా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయినట్టు ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శ్రీవిజయ-182 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు ఇక్కడి సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. తరువాత నాలుగు నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జకార్తాకు ఉత్తర తీరంలోని వెయ్యి ద్వీపాలకు సమీపంలో బహుశా ఈ విమానం కూలిపోయివుంటుందని అధికారులు భావిస్తున్నారు. జకార్తా- పోంటియానక్ మార్గంలో వెళ్తున్న ఎస్వైజె-182 విమానంతో తాము సంబంధాలు కోల్పోయామని ఇండొనేషియా విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం పోంటియానాక్కు చేరుకోవాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గురయ్యేటప్పుడు విమానంలో మొత్తం 62మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు శిశువులతో సహా ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం 3వేల మీటర్ల ఎత్తులో ఎగురుతుండగా అదృశ్యమైందని విమాన ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపింది. స్థానిక జాలర్లు జకార్తా తీరప్రాంతంలోని దీవుల సమీపంలో తేలియాడుతున్న కొన్ని శకలాలను గుర్తించి బయటకు తీశారు. అవి శ్రీ విజయ-182 విమానానికి సంబంధించినవా, కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. విమాన జాడ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు ఇండొనేషియా విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదిత ఐరావతి తెలిపారు.