Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో 2.3శాతం ఆర్థిక వృద్ధి
- 15.42 ట్రిలియన్ డాలర్లకు జీడీపీ : చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడి
బీజీంగ్ : ప్రపంచంలో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ ప్రమాదకర కరోనా ప్రపంచలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా కుంగదీశాయి. సంపన్నదేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. కానీ, ఆర్థికంగా తిరిగి పుంజుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. అయితే, చైనా మాత్రం ఈ ఆర్థిక ఇబ్బందిని అధిగమించింది. 2020లో ఏకంగా 2.3శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. ఈ మేరకు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) తెలిపింది. ఎన్బీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచలోనే రెండో ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020లో 2.3శాతం పెరిగి 15.42 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇది ఆదేశ కరెన్సీ ప్రకారం 100 ట్రిలియన్ యువాన్లను దాటింది. అంటే 101.5986 ట్రిలియన్ యువాన్లకు చేరుకున్నది. కరోనాతో తొలుత తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులను ఎదుర్కొన్న దేశం చైనా. మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా 2020 తొలి త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 6.8శాతం తగ్గింది. అయితే, వెంటనే కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న చైనా దేశం ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోగలిగింది. కరోనా మహమ్మారిగా మారి భారత్తో పాటు ప్రపంచదేశాలను వణికిస్తున్న సమయంలోనూ చైనా జీడీపీలో పెరుగుదల కనబడింది. దీంతో 2020 నాలుగో త్రైమాసికంలో చైనా దేశ జీడీపీ 6.5శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో నమోదైన 4.9శాతం వృద్ధి రేటు కంటే వేగంగా ఇది నమోదు కావడం గమనార్హం.