Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల వల్ల బాగా దెబ్బతింటున్నది అతి తక్కువ ఆదాయం కలిగిన దేశాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రియెసెస్ హెచ్చరించారు. 3.9 కోట్ల డోసుల కోసం దరఖాస్తు చేస్తే కేవలం 25 డోసులు అందాయని తెలిపారు. ''తీవ్రమైన స్థాయిలో నైతిక విలువలు దెబ్బతినే ప్రమాదం ముంగిట మనమున్నాం. ఆ వైఫల్యానికి మూల్యం నిరుపేద దేశాల్లోని ప్రజల ప్రాణాలు, ఉద్యోగాలు.'' అని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా తమ దేశాల్లోని ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకు వ్యాక్సిన్లు అందేలా చూడడం అన్ని ప్రభుత్వాల ప్రధాన బాధ్యతే అంతే కానీ, నిరుపేద దేశాల్లో అవసరమైన వారికి అందకుండా సంపన్న దేశాల్లోని యువతకు, ఆరోగ్యవంతమైన ప్రజలకు కూడా టీకాలు అందేలా చూడడం సరైన పని కాదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ అందచేసిన సమాచారం ప్రకారం, కోవిడ్ వ్యాక్సిన్లు 25 మాత్రమే అందుకున్న ఏకైక దేశం గినియా. అంటే ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో 0.00006 శాతం వ్యాక్సిన్లు గినియాకు అందాయి. గతవారం డబ్ల్యూహెచ్ఓ యూరప్ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ, మొత్తం డోసుల్లో 95 శాతాన్ని కేవలం పది దేశాలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. కొవాక్స్ కేంద్రానికి వెలుపల కొవిడ్ వ్యాక్సిన్ను కొనుగోలు చేయవద్దని ప్రభుత్వాలను డబ్ల్యూహెచ్ఓ కోరింది. దీనివల్ల నిరుపేద దేశాలు తమ ప్రజలకు టీకాలు వేయడం మరింత కష్టసాధ్యం కాగలదని అన్నారు. కొవాక్స్ పథకం ద్వారా టీకాల పంపిణీ ప్రారంభిస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.