Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త, అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్న అంజలీ భరద్వాజ్కు అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్షిప్ అవార్డు'ను ప్రకటించింది. 'సత్యానికి, పారదర్శకతకు, జవాబుదారీతనానికి కట్టుబడి ఉండి, అటు స్వదేశానికి, ఇటు ఇతర దేశాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా' నిలుస్తునందుకు ఆమెకు ఈ అవార్డును అందజేస్తున్నట్టు జో బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ అవార్డును ప్రకటిస్తూ, అంజలితో సహా 12 మంది పేర్లను ఈ అవార్డుకు పరిశీలించినట్టు తెలిపారు. వీరంతా తమ తమ దేశాలలో అవినీతి నిర్మూలనకు, పారదర్శకత్వానికి, జవాబుదారీతనానికి అవిశ్రాంతంగా పోరాటం జరుపుతున్నారని చెప్పారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మొక్కవోని పట్టుదల, ధైర్యంతో ఉద్యమంగా ముందుకు సాగారని వివరించారు. ''ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో కలిసికట్టుగా పోరాడితే తప్ప అవినీతిని నిర్మూలించలేమని జో బైడెన్ ప్రభుత్వం నమ్ముతోంది. అవినీతిపై పోరాడడానికి, పారదర్శకత, జవాబుదారీతనాలకు అండగా నిలవడానికి ఎంతో గుండె ధైర్యం అవసరం. వీరందరిలోనూ ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అంజలీ భరద్వాజ్ ముందంజలో ఉన్నారు'' అని బ్లింకెన్ తెలిపారు.
కాగా, దేశంలో అవినీతిపై అంజలి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. 'నేషనల్ కాంపైన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్'కు సహ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆమె.. స్వయంగా 2003 నుంచి 'సతర్క్ నాగరిక్ సంఘటన్' అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
రఆమె సమాచార హక్కు, లోక్పాల్, ఆహార హక్కు వంటి ప్రజావసర అంశాలపై కూడా ఉద్యమం సాగించారు. 1973లో పుట్టిన అంజలి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.ఏ చేసిన తర్వాత ఆక్స్ఫర్డ్లో ఎం.ఎస్సీ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎం.ఎస్సీ చదివారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను సమాచార హక్కు కిందకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.