కొలంబో : దాదాపు రెండు వారాల తర్వాత అత్యవసర పరిస్థితిని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం రాత్రి నుండి ఇది అమల్లోకి వచ్చింది. అనూహ్యమైన ఆర్థిక సంక్షోభంతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ ఎమర్జన్సీని విధించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అధ్యక్షుడు రాజపక్సా ఎమర్జన్సీని ప్రకటించారు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపడడంతో ఎమర్జన్సీని తొలగించారు. దేశంలో ద్రవ్యోల్బణం రేటు 40శాతంగా వుంది. ఆహారం, ఔషధాలు, ఇంధనానికి తీవ్ర కొరతగా వుంది. విద్యుత్ కోతలతో పరిస్థితులు దుర్భరంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 9మంది మరణించగా, 200మందికి పైగా గాయపడ్డారు.