Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : డ్రోన్లను, క్షిపణులను కూల్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫిరంగిని రష్యా ప్రభుత్వం ఆవిష్కరించింది. అత్యధిక పౌనపున్యంతో కూడిన ఈ ఫిరంగి దాదాపు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సైన్యాలను కూడా సునాయాసంగా మట్టుబెట్టగలదని మాస్కో రేడియో ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. అంతేగాకుండా వాయువిమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసి ఆ ఫిరంగితో దాడులను జరపవచ్చునని పేర్కొంది. దీనిపై రష్యా సైనికులు ఈనెల 16నుంచి 19 వరకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
దానికై మాస్కోలోని పాట్రియాట్ అమ్యూస్మెంట్ పార్కును ఎంపిక చేశారు. అత్యాధునిక ఆయుధాలను కూడా తక్కువ ఎత్తులో చేధించగల సాంకేతిక పరిజ్ఞానం రష్యా తయారు చేసిన ఫిరంగిలో ఉందని నిపుణులు తెలిపారు. ఈఫిరంగిని రేడియో ఎలక్ట్రానిక్ వ్యవస్థతో ప్రత్యేకంగా రూపొందించామన్నారు.
కాగా ఈ ఏడాది రష్యా ఆర్మీ ప్రదర్శించే ప్రదర్శనలన్నింటిలోనూ ఈ ఫిరంగియే ప్రత్యేక ఆకర్షణగా నిలవగలదని మాస్కో రేడియో ఇంజనీరింగ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. శత్రు సైన్యాలను ఎదుర్కొనేందుకు వీలుగా 'లోకస్ట్ టెక్నాలజీ'తో కూడిన ప్రత్యేక ఆయుధాన్ని అమెరికా నావికాదళం ఇటీవల తయారు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఆయుధపనితీరుపై ఈ ఏడాది ఏప్రిల్లో ప్రదర్శన నిర్వహించింది. అయితే అమెరికాకు పోటీగా రష్యా తయారు చేసిన ఫిరంగి అమెరికా దాడులను ఎదుర్కొనగలదని రాస్టెక్ కార్పోరేషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా రష్యా ఆవిష్కరించిన ఆయుధం ప్రమాదకరమని సర్వత్రా విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.