Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా పార్లమెంట్ ఎగువసభ స్పీకర్ వాలెంతీనా మాట్వియెంకో
మాస్కో : అమెరికా ఆధిపత్య ధోరణి వల్లే ప్రపంచంలో యుద్ధాలు, అస్థిరత, హింస చోటుచేసుకుంటున్నాయని, అమెరికా ఎగుమతి చేస్తున్న 'ప్రజాస్వామ్యం' అత్యంత ప్రమాదకరమైనదని, ఒక విధంగా నిప్పుతో చెలగాటమని రష్యా ఎగువసభ స్పీకర్ వాలెంతీనా మాట్వియెంకో అన్నారు. 'సెప్టెంబర్ 15-అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం' సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే...
ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా తనదైన 'ప్రజాస్వామ్యా'న్ని బలవంతంగా రుద్దుతున్నదని, దీనివల్లే రాజకీయ వైపరిత్యాలు తలెత్తుతున్నాయని, అంతర్యుద్ధాలు-అహింస, అస్థిరత వీటి ఫలితమేనని ఆమె అభిప్రాయపడ్డారు. లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం దేశాల్లో అస్థిరత గల కారణం...పాశ్చాత్య దేశాల విపరీత జోక్యం, ఆయా దేశాల అంతర్గత అంశాల్లో వేలుపెట్టడమేనని అన్నారు. దీని గురించి ఆమె మరింత విశ్లేషిస్తూ...
''వివిధ రకాల పద్ధతుల్ని ఎంచుకొని ఆయా దేశాలపై రాజకీయ, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకొస్తున్నారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణ' అనే పేరుతో ఆయా దేశాల అంతర్గత అంశాల్లో అమెరికా చొరబడుతున్నది. దీని వెనుకున్న లక్ష్యం ఒకటే..అది అమెరికా, దాని మిత్ర దేశాల ఆధిపత్యం ప్రపంచంపై కొనసాగటం కోసమే. ఇందుకోసం అమెరికా తనదైన 'ప్రజాస్వామ్యాన్ని' ఎగుమతి చేస్తుంది. ఇది సైనిక జోక్యం కన్నా ప్రమాదకరం. అస్థిరత, హింస, అంతర్యుద్ధం తలెత్తి...పెద్ద సంఖ్యలో ప్రజలు బాధితులవుతారు'' అని అన్నారు.
ప్రజలు నిర్ణయించాలి..
బయట శక్తులు కాదు.. తమదే నిజమైన ప్రజాస్వామ్యం, ఆదర్శవంతమైనదని పాశ్చాత్య దేశాలు సర్టిఫికెట్ చూపుతున్నాయి. ఆదర్శ ప్రజాస్వామ్యం తమ గుత్తసొత్తు అన్నట్టు మాట్లాడుతుంటాయి. మిగతా ప్రపంచమంతా తమను అనుసరించాలని హితబోధ చేస్తాయి. కొన్ని దేశాల్ని విద్యార్థుల్లా మార్చి పాఠాలు చెబుతాయి. ఏ తరహా ప్రజాస్వామ్యం ఉండాలన్నది ఆ దేశంలో ఉండే ప్రజలు నిర్ణయించాలి గానీ, బయటి శక్తులు నిర్ణయించటమేంటి ?
- వాలెంతీనా మాట్వియెంకో