Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందుకే అణు, క్షిపణి కార్యక్రమం : ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
ప్యాంగ్యాంగ్ : ''అమెరికా సైనిక శక్తికి సరితూగేలా ఉ.కొరియా ఎదగాలి. అందుకోసమే అణు కార్యక్రమం చేపట్టాం. వారితో పోల్చు కుంటే, మా సైనిక సామర్థ్యం సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం. అప్పుడే అమెరికా నేతలు మాకు చేస్తున్న హెచ్చరికలను అడ్డుకోగలం. వారిని నిలువరించగలం'' అని ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అన్నారు. దీనికి సంబంధించి కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వార్తల్ని ప్రసారం చేసింది. దేశాధ్యక్షుడు కిమ్ శనివారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను ఎందుకు అణు, క్షిపణి పరీక్షలు చేయాల్సి వస్తుందో అనే అంశంపై చిన్న వివరణ ఇచ్చారు.
అమెరికా ప్రతీసారి తన సైనిక బలంతో బెదిరింపులకు దిగుతున్నదని, దీనిని ఎదుర్కోవాలంటే తమ ముందు ఉన్న ఒకే మార్గం...ఆ దేశ సైనిక సంపత్తితో సమానంగా ఎదగటమేనని కిమ్ వివరించినట్టు ఆ దేశ న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి.
ఆ కార్యక్రమంలో భాగంగానే క్షిపణి ప్రయోగాలు చేపడుతున్నట్టు కిమ్ అన్నారు. ఎన్ని ఆంక్షలు విధించిన తమ అణుకార్యక్రమం ఆగదని పెద్దదేశాలకు చూపించామన్నారు.
ఈ పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా 'సైనికచర్య' అనే మాట మాట్లాడేందుకు కూడా ధైర్యం చేయదని వివరించారు. హ్వసాంగ్-12 క్షిపణి పరీక్షను ఉ.కొరియా అధినేత ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశ అణు అవసరాలను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేసినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. తాజా పరీక్షతో ఉత్తరకొరియా శక్తి మరింత పెరిగిందని కిమ్ వివరించారని తెలిపింది.