Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్ను 99 శాతం అడ్డుకునే
- యాంటీబాడీని తయారుచేసిన శాస్త్రవేత్తలు
- కోతులపై ఫలించిన శోధన... త్వరలో మనుషులపై ప్రయోగాలు
లండన్ : హెచ్ఐవీ వైరస్పై జరుగుతున్న పరిశోధనలో శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. వీరు కృత్రిమంగా తయారుచేసిన 'యాంటీబాడీ' (ప్రతిరక్షకాలు) హెచ్ఐవీ వైరస్ను 99 శాతం దెబ్బతీయగలిగింది. హెచ్ఐవీ వైరస్ తన ప్రభావం చూపకుండా అడ్డుకోవటంలో ఈ 'యాంటీబాడీ' దాదాపు విజయం సాధించిందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ, ఔషధ తయారీ సంస్థ సనోఫీ సంయుక్తంగా ఈ పరిశోధనలు జరిపాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, స్క్రిప్స్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఇందులో పాలుపంచుకున్నారు.
శాస్త్ర పరిశోధనలో ఇదొక గొప్ప మలుపుగా 'అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ' పేర్కొన్నది. తాజాగా శాస్త్రవేత్తలు తయారుచేసిన యాంటీబాడీలను ప్రయోగించి మానవులపై 2018లో పరీక్షలు జరపనున్నారని తెలిసింది. హెచ్ఐవీ వైరస్కు మందు కనుగొనటంపై ఎన్నో ఏండ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద ఔషధ సంస్థలు పరిశోధనలు జరుపుతున్నాయి. ఈ ప్రయోగాలేవీ ఫలించకపోవడానికి కారణం 'హెచ్ఐవీ' వైరస్కు ఉన్న విలక్షణత. వైరస్ బారిన పడ్డ ఏ ఇద్దరిలోనూ వైరస్ మౌలిక స్వరూపం ఒకేవిధంగా ఉండదు. మానవుల్లో ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్న హెచ్ఐవీ వైరస్ జాతుల రకాలు కోట్లలో ఉన్నాయి. దీంతో శాస్త్రవేత్తలు కూడా సరైన మందును తయారుచేయలేకపోయారు.
అలా..అని వైరస్ ఆటలు సాగవు
మానవ శరీరమే హెచ్ఐవీకి తగిన బుద్ధి చెప్పగలదని శోధనలో తెలింది. వైరస్ బారిన పడ్డ కొంతమందిలోని శరీర రోగ నిరోధక వ్యవస్థ ''శక్తివంతమైన సహజ యాంటీబాడీస్''ను తయారు చేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి శరీరంలోని హెచ్ఐవీ వైరస్ జాతుల్ని ఈ యాంటీబాడీస్ నిర్మూలిస్తున్నది. ఇలాంటి మూడు రకాల యాంటీబాడీస్తో శాస్త్రవేత్తలు సరికొత్త మందును ఆవిష్కరించారు. ఇది హెచ్ఐవీ వైరస్ను అడ్డుకోవటంలో 99 శాతం విజయం సాధించినట్టు 'జర్నల్ సైన్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 24 కోతులపై ఈ మందును శాస్త్రవేత్తలు ప్రయోగించి చూసారు. ఆ తర్వాత హెచ్ఐవీ వైరస్ను వాటి శరీరాల్లోకి పంపగా, హెచ్ఐవీ వైరస్ ప్రభావం ఏ మాత్రమూ కనపడలేదు. దాదాపు 99 శాతం వైరస్ దాడుల్ని యాంటీబాడీస్ అడ్డుకోగలిగాయి.
హెచ్ఐవీ వైరస్పై తాజా పరిశోధనా ఫలితాలు మమ్మల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాయి. మనుషులపై 2018లో క్లినికల్ టెస్టులు జరిగాకగానీ...పూర్తిగా ఓ నిర్ధారణకురాలేం. వీలైనంత తొందరగా మానవులపై పరీక్షలు జరిపి..విషయాన్ని తేల్చుకోవాలన్న ఆతృత ఉంది.
- ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ అధ్యక్షుడు లిండా గాలి బెక్కర్