Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పెను ప్రమాదం తప్పింది. ఆమెను దారుణంగా హత్య చేసేందుకు ఆమె సెక్యూరిటీ గార్డ్స్ కుట్రలు చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బందే ఎలా హతమార్చిందో..ఆ తీరుగానే హసీనాను చంపేయాలనుకున్నారు. అయితే, ముందస్తుగా తేరుకున్న నిఘా విభాగం ఆమెను ఈ ప్రమాదం నుంచి బయటపెట్టింది. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. అక్కడి పోలీసులు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత ఆగస్టు 24నే హసీనాను హత్య చేద్దామని అనుకున్నారు.
మొత్తం నాలుగు నిఘా వర్గాలు ఈ ఇన్పుట్స్ అందించగా అందులో రెండు సంస్థలు బంగ్లావి కాగా.. మరో రెండు భారత్కు చెందిన నిఘా సంస్థలు ఈ వివరాలు అందించాయి. వాటి ప్రకారం హసీనా భద్రతను చూసుకునే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్)కు చెందిన ఆరు నుంచి ఏడుగురు గార్డ్స్ ఇందుకు ప్లాన్ చేశారు. ఆ రోజు సాయంత్రం హసీనా తన కార్యాలయంలో పనులు పూర్తి చేసుకొని బయటకు రాగానే ఆమెపై దాడి చేయాలని భావించారు. ఆ తర్వాత వారు పారిపోయేలా ఆ భవనం చుట్టు బాంబులు పేల్చి వేసి గందరగోళం సృష్టించి ఆ సమయంలో పరారవ్వాలని కూడా కుట్ర చేశారు. ఇదంతా కూడా జమాత్ ఉల్ ముజాహీదీన్(జేఎంబీ) ఉగ్రవాదులు ఎస్ఎస్ఎఫ్ గార్డులు కలసి ప్లాన్ చేసినట్టు తేలింది. అయితే, భారత్, బంగ్లాదేశ్ నిఘా వర్గాల పరస్పర సహకారంతో కుట్ర భగం చేయగలిగారు.