Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్ జోంగ్ ఉన్ ఎక్కువకాలం ఉండరు అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ఉ.కొరియా అధినేతపై ట్విట్టర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. మాటలతో కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ''ఉ.కొరియా విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడినదాన్ని ఇప్పుడే విన్నాను. లిటిల్ రాకెట్మ్యాన్ (కిమ్ జోంగ్ ఉన్), అతడు (ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ ) ఇలాగే మాట్లాడితే ఎక్కువ కాలం ఉండరు'' అంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. శనివారంనాడు అమెరికాను ఉద్దేశించి ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ ఐరాసలో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ట్రంప్ పై వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది.
గత కొద్దిరోజులుగా డొనాల్డ్ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనివల్ల పరిస్థితి అత్యంత సున్నితంగా మారిందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా...అది అణు యుద్దాన్ని తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. సమస్యను తీవ్రతరం చేయకుండా అమెరికా, ఉత్తర కొరియా నేతలు సంయమనం పాటించాలని వారు కోరారు. జపాన్ గగనతలం మీదుగా ఉ.కొరియా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకూడదని, అదే సమయంలో అమెరికా సైతం దక్షిణ కొరియాలో తన యుద్ధ విమానాలను మోహరించడం మానివేయాలని అదే సమస్యకు అసలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాకు వ్యతిరేకంగా ఉ.కొరియాలో భారీ నిరసన
తమ దేశంపై, తమ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఉ.కొరియా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు తరలివచ్చారు. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో శనివారంనాడు జరిగిన 'ట్రంప్ వ్యతిరేక' ర్యాలీలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ వైఖరిని సమర్థిస్తూ నినాదాలు చేశారు. కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటామని వారంతా ప్లకార్డులు ప్రదర్శించారు.ఈ సందర్భంగా రెడ్గార్డ్స్ కమాండింగ్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..''మేము సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం. అమెరికాతో తేల్చుకోవడానికి మేమంతా సిద్ధం. ప్రపంచపటం నుంచి ఆ దుష్ట సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టేస్తాం. మా సుప్రీం కమాండర్ కిమ్ జోంగ్ ఉన్ ఆదేశం ఇస్తే చాలు, మేమంతా రంగంలోకి దిగుతా''మని అన్నారు.