Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో : సిరియాలో శాంతి స్థాపనే తమ ముందున్న ఏకైక లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు. సిరియాలోని ఉగ్రసంస్థలను పారద్రోలేందుకు రష్యా బలగాలు అవిశ్రాంతంగా శ్రమించాయని అన్నారు. సిరియా బలగాలతో కలిసి తమ సైనికులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం పుతిన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడారు. సిరియాలో ఉగ్రసంస్థలన్నీ ఒక్కొక్కటిగా తోకముడుస్తున్నాయని అన్నారు. ఐఎస్ ఆత్మరక్షణలో పడిందన్నారు. ఉగ్రవాదులు సిరియా సరిహద్దు నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారన్నారు. సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం వారంతా సిరియాలో శాంతి స్థాపన జరగాలనే కోరుకుంటున్నారని అన్నారు. సిరియన్ల శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలన్నీ చేపట్టేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సిరియాలో స్థిరత్వం కోసం రౌహానీ, ఎర్డోగన్లతో పుతిన్ సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు క్రెమ్లిన్ కార్యాలయం పేర్కొన్నది. సిరియాలో శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోచీ సదస్సులో చర్చిస్తారని తెలిపింది. అంతకుముందు, సిరియా అధ్యక్షుడు అస్సద్ పుతిన్ను కలిశారు. సిరియాలో ఉగ్రసంస్థలను పారద్రోలేందుకు రష్యా బలగాలు నిర్వహించిన కృషిని ఆయన అభినందించారు. సిరియన్ల ప్రాణాలను ఉగ్రవాదుల బారి నుంచి రక్షించిన పుతిన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సిరియా ప్రజలంతా పుతిన్కు రుణపడి ఉంటారని అన్నారు.