Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబూల్లో ఉద్యోగులంతా సురక్షితం, ధ్వంసమైన ఐటీబీపీ బ్యారక్
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎంబసీ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఓ రాకెట్ పడింది. అయితే ఈ ఘటనలో దౌత్యవేత్తలకు, సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'కాబూల్లోని మన ఎంబసీ కార్యాలయ ప్రాంగణంలో ఓ రాకెట్ ల్యాండ్ అయ్యింది. దీంతో, ఐటీబీపీ బ్యారక్ స్వల్పంగా దెబ్బతింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు' అని రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. భవనం పై భాగంలో రాకెట్ పడినట్టు ధ్రువీకరించారు. ఎంబసీ ప్రాంగణంలోని సిబ్బంది, ప్రజలకు ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. అయితే, ఈ రాకెట్ను ఎవరు ప్రయోగించారు.. భారత ఎంబసీని లక్ష్యంగా చేసుకునే రాకెట్ ప్రయోగం జరిగిందా ? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, గతేడాది మార్చిలో కాబూల్లోని భారత ఎంబసీ కార్యాలయానికి సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 90 మంది మృతి చెందగా, 400 మంది గాయపడ్డారు.