Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: ఉభయ కొరియాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తున్నది. గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దూరం చేసేందుకు వింటర్ ఒలింపిక్ గేమ్స్ సహకరిస్తున్నాయి. దక్షిణ కొరియా దేశంలో జరగనున్న ఒలింపిక్ గేమ్స్లో ఉభయ కొరియా దేశాలు ఒకే పతాకంతో కవాతులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని బుధవారం దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సైనిక రహిత ప్రాంతంలో జరుగుతున్న చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఉభయ కొరియాల క్రీడాకారులతో కూడిన ఐస్హాకీ బృందం శీతాకాల ఒలింపిక్స్లో పాల్గొననుంది. వచ్చే నెల తొలివారంలో ఈ క్రీడ సంబురాలు ప్రారంభం కానున్నాయి.ఇరు దేశాల మధ్య సోమవారం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనకు అనుగుణంగా డీమిలటరైజ్ జోన్ పనాముంజింలోని పీస్హౌస్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాలు చర్చల్లో ఏకాభిప్రాయనికి వచ్చినట్టు స్థానిక మీడియా సంస్థలు ప్రచురించాయి.
ఉత్తరకొరియాపై ఒత్తిడి సరికాదు : రష్యా హెచ్చరిక
ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచేందుకు అమెరికా నేతృత్వంలోని కూటమి చేస్తున్న ప్రయత్నాలను రష్యా తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని హెచ్చరించింది. పైగా ఈ చర్యలు, కార్యక్రమాలన్నీ ఐక్యరాజ్య సమితి అధికారాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొంది. . ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని విడనాడేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచుతూ మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించే అవకాశాన్ని పరిశీలించేందుకు వాంకోవర్లో అమెరికా, కెనడాలు ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు 20దేశాలు హాజరవుతున్నాయి.. కాగా, ఈ సదస్సుకు రష్యా, చైనా దౌత్యవేత్తలను ఆహ్వానించలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యమైన పరిస్థితి కాదని స్పష్టం చేసింది.