Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : నేపాల్ రాజధాని ఖాట్మండ్లో క్రాష్ల్యాండింగ్ అయిన విమానం పైలట్కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మధ్య జరిగిన సంభాషణలో గందరగోళం కారణంగానే కూలినట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన యూఎస్-బంగ్లా ఎయిల్లైన్స్కు చెందిన విమానం ఖాట్మండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానా శ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో సోమవారం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మంది చనిపోయారు. అయితే, విమానం కిందికి దిగడానికి తక్కువ ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండింగ్ సూచనల్లో గందరగోళం నెలకొందని, ఒక్కసారిగా భూమిని తాకి మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరం వైపు ల్యాండింగ్ కోసం పైలట్ తొలుత అనుమతి కోరగా ఏటీసీ అంగీకరించింది. అయితే ఒక నిమిషం లోపే మళ్లీ పైలట్ తాను దక్షిణంపైపు దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దక్షిణం వైపు ల్యాండింగ్కు క్లియర్ చేస్తున్నట్టు ఏటీసీ చెప్పినట్లు రికార్డింగ్లో ఉన్నట్టు సమాచారం. అయితే దక్షిణం వైపు ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఉత్తరం వైపు వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ల్యాండింగ్కు ముందు పైలట్ 'మేము ల్యాండ్ అవ్వొచ్చా?' అని అడిగినట్టు చెప్పారు. చివరలో ట్రాఫిక్ కంట్రోలర్ భయంతో మాట్లాడినట్లు అనిపించిందని, పైలట్తో 'ఐ సే అగైన్, టర్న్' అని అన్నారని, ఆ తర్వాత వెంటనే కంట్రోలర్ అగ్నిమాపక సిబ్బందిని రన్వే పైకి వెళ్లమని ఆదేశించిందని చెప్పారు. విమానం దిగడానికి ముందు పలుమార్లు దిశ మార్చుకునే ప్రయత్నం చేసిందని మరో వ్యక్తి తెలిపారు. విమానం భూమిని తాకగానే వరుసగా రెండు పేలుళ్లు వినిపించాయని కూలిన విమానాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి తెలిపారు. నిమిషాల్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ చెలరేగిందని చెప్పారు. ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం విమానం త్రిభువన్ విమానాశ్రయం చుట్టూ రెండు రౌండ్లు వేసిందని ఖాట్మండ్ వైమానిక సంస్థ మేనేజర్ తెలిపారు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలు సరిగ్గా పాటించలేదని, విమానం తప్పుడు దిశలో రన్వే పైకి వచ్చిందని ఖాట్మండ్ విమానాశ్రయం జనరల్ మేనేజర్ తెలిపారు.