Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందంటూ ప్రముఖ సోషల్మీడియా వెబ్సైట్ ఫేస్బుక్పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఎట్టకేలకు స్పందించారు. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో కంపెనీ నుంచి పొరబాటు జరిగిందని జుకర్బర్గ్ అంగీకరించారు. అయితే, తమ పొరబాటును సరిదిద్దుకుంటున్నామని తెలిపారు.
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డెవలపర్లు, బిజినెస్ భాగస్వాములతో కలిసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఫేస్బుక్ను నేను ప్రారంభించాను. మా ప్లాట్ఫాంపై ఏం జరిగినా అందుకు నేను బాధ్యత వహించాల్సిందే. యూజర్ల డేటాను భద్రంగా ఉంచే బాధ్యత మాపై ఉంది.
ఒకవేళ అలా చేయలేకపోతే మీకు సేవలందించే అర్హÛత నేను కోల్పోయినట్లే. అయితే, మేము కూడా పొరబాట్లు చేస్తుంటాం. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మరోసారి ఇలాంటివి జరగకుండా పొరబాటును సరిదిద్దుకుంటున్నాం. యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని యాప్లను పరిశీలిస్తాం. ఏదైనా యాప్ అనుమానాస్పదంగా కన్పిస్తే దానిపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహిస్తాం. అంతేగాకుండా, ఒక వ్యక్తి మూడు నెలలుగా ఫేస్బుక్ను వినియోగించకపోతే ఆ వ్యక్తి డేటాను తెలుసుకోకుండా ఉండేలా డెవలపర్ యాక్సెస్ను తొలగిస్తాం. దీంతో పాటు ఫేస్బుక్ ఖాతాను తెరిచే సమయంలో అడిగే వివరాలను కూడా తగ్గిస్తాం. పేరు, ఈమెయిల్ ఐడీ, ప్రొఫైల్ ఫొటో మాత్రమే అడిగేలా యప్ను మారుస్తాం. త్వరలోనే మరిన్ని మార్పులతో మీ ముందుకు వస్తాం' అంటూ జుకర్బర్గ్ చెప్పుకొచ్చారు. భారత్, బ్రెజిల్ దేశాల ఎన్నికల్లో ఫేస్బుక్ యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా ఉండేలా చూస్తాం అని అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా.. ఐదు కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ఫేస్బుక్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ విషయమై అమెరికాలోని శాన్జోస్ కోర్టులో కేసు కూడా నమోదైంది.
మరోవైపు ఈ వ్యవహారం విషయంలో భారత్ కూడా ఫేస్బుక్ను గట్టిగా హెచ్చరించింది. భారత ఎన్నికల ప్రక్రియల్లో అక్రమ మార్గాల ద్వారా జోక్యం చేసుకుంటే సహించేది లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. అలా జరిగితే కఠిన చర్యలు తీసుకునేందుకూ వెనుకాడబోమని.. అవసరమైతే జుకర్బర్గ్కు సమ్మన్లు పంపుతామని అన్నారు. ఇలా వరుస ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జుకర్బర్గ్ క్షమాపణలు తెలిపారు.