Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నజాఫ్ నగరంలో ఎగిరిన ఎర్రజెండా
- ఉపాధ్యాయురాలి స్థాయి నుంచి ఎంపీగా గెలుపొందిన సుహాద్
బాగ్దాద్ : ఇరాక్లో ఈనెల12న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐసీపీ) మహిళా అభ్యర్థి సుహాద్ అల్-ఖతీబ్ గెలుపొందారు. అంతేగాకుండా, ఐసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. నజాఫ్ నగరంలో ఎర్రజెండా ఎగిరింది. షియా ముస్లింల జనాభా అధికంగా ఉన్న ఈ నగరంలో ఆమె గెలుపొందడం గమనార్హం. ఓ సాధారణ ఉపాధ్యాయురాలి స్థాయి నుంచి ఎంపీ స్థాయికి సుహాద్ ఎదిగారు. సామ్యవాద భావాలతో ప్రజల ఆధరాభిమానాలను చూరగొన్నారు. ఇరాక్లో మహిళల హక్కుల సాధన కోసం, పేదరిక నిర్మూలన కోసం అవిరామ కృషి చేశారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం సుహాద్ మాట్లాడారు. 'ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. మా పార్టీకి చరిత్ర ఉంది. విదేశీ ఏజెంట్లకు మేం ఏనాడూ కొమ్ముకాయ లేదు. అంతర్యుద్ధాల పేరిట ఇరాక్కు హాని తలపెట్టాలని అమెరికా, ఇరాన్ దేశాలు కుట్రపన్నాయి. దేశ సార్వభౌమత్వం పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇరాక్ ప్రజల మనోభావాలను ఐసీపీ అర్థం చేసుకుంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని మీకు మరోసారి భరోసా ఇస్తున్నాను. దేశాన్ని పట్టిపీడిస్తున్న పలు సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ఉధృతం చేస్తాను. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే తత్పరత ఐసీపీలో ఉన్నది. ఈఎన్నికల్లో నా గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ధన్యవాదాలు' అని అన్నారు. ఇరాక్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన సుహాద్ను ఐసీపీ జనరల్ సెక్రటరీ రైద్ జాహిద్ ఫాహ్మీ అభినందించారు. సద్రిస్ట్లతో కలిసి తమ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కార్కానికి కృషి చేస్తామన్నారు. అంతేగాకుండా, మహిళల హక్కుల కోసం పోరాడతామని అన్నారు. 1934, మార్చి31న హమీద్ మాజిద్ మౌసా ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బాగ్దాద్ నగరంలో ఉంది. ఇరాక్ చరిత్రగతులను మార్చడంలో ఐసీపీ కీలక పాత్ర పోషించింది. 1991లో కువైట్ యుద్ధం సంభవించింది. 2003లో ఇరాక్పై అమెరికా దురాక్రమణకు పాల్పడినప్పుడు అగ్రరాజ్యంపై ఐసీపీ గళం విప్పింది. అమెరికా అరాచకాలను ఎండగట్టి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టించి దేశ ప్రజల ఆధరాభిమానాలను చూరగొంది. 2005లో జరిగిన ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందింది. 2013లో ఇరాక్ గవర్నరేట్ ఎన్నికల్లో పలు సీట్లు కైవసం చేసుకుంది. సైరౌన్ కూటమితో పొత్తుపెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగింది. ఈనెల12న జరిగిన ఎన్నికల్లో సైరౌన్ అలియన్స్ 54 ఎంపీ స్థానాలు సాధించింది. నజాఫ్లో సైరౌన్ కూటమికి 92,026 ఓట్లు నమోదు కాగా, ఫతా కూటమికి 82,838 ఓట్లు వచ్చాయి.