Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట నిలబెట్టుకోని ట్రంప్
వాషింగ్టన్: సరిగ్గా పది రోజుల క్రితం ఇక ''ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదు''అని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలతో అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశం మీద విధించిన కఠిన ఆంక్షలను అలాగే కొనసాగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నెల 12న సింగపూర్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ -ఉన్తో ట్రంప్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ తర్వాతి రోజు అంటే జూన్ 13న ''ఇక ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అణ్వాయుధ ముప్పు ఉండదు'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. ''ఇక ఈరోజు రాత్రి అమెరికన్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చు'' అని మరో ట్వీట్ చేశారు. అంతేకాదు, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించాల్సిన సైనిక విన్యాసాలను రద్దు చేశారు. దౌత్యపరమైన సంప్రదింపులకు మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకు న్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఆ పరిణామాలతో ఇక అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండబోదని అంతా భావించారు.
జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తాం...
ఉత్తర కొరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ 2008 జూన్ 26న అమెరికా ''జాతీయ అత్యవసర పరిస్థితి''ని ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించింది. అయితే, అప్పటి నుంచి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షలందరూ ఆ ఆంక్షలను పునరుద్ధరిస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేశారు.
''కొరియా ద్వీపకల్పంలో ప్రమాదకరంగా పొంచిఉన్న విధ్వంసకర ఆయుధాలు, ఉత్తర కొరియా ప్రభుత్వ చర్యలు, విధానాల కారణంగానే జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నాం'' అని ట్రంప్ పేర్కొన్నారు. ''ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాల వల్ల అమెరికా జాతీయ భద్రతకు, విదేశీ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు ముప్పే'' అని పార్లమెంటుకు పంపిన నోట్లో ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై ఇంకా సంప్రదిం పులు కొనసాగుతున్నందున ఆ దేశంపై విధించిన ఆంక్షలు అలాగే ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపేయో అన్నారు. అయితే, పది రోజుల కింద ట్రంప్ చెప్పిన మాటలకు, తాజా ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉందని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ ఛుక్ ష్యూమర్ విమర్శించారు.